హైదరాబాద్: నేడు(జులై 7) 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్న టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీకి నందమూరి బాలయ్య పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలిపాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ అరుదైన ఫొటోను షేర్ చేస్తూ..మచ్చ లేని నాయకుడు, ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన లెజండరీ క్రికెటర్ ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ బాలయ్య రాసుకొచ్చాడు. ఈ ఫొటోను అటు బాలయ్య అభిమానులు, ఇటు ధోనీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్, ఫేవరెట్ హీరో ఇద్దరూ ఒకే ఫ్రేమ్లో ఉండటం చూసి తెగ సంబర పడిపోతున్నారు.
ఈ పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే వేల సంఖ్యలో నెటిజన్లు స్పందించారు. ఈ ఫోటో ధోనీ హైదరాబాద్లో మ్యాచ్ ఆడేందుకు వచ్చిన సందర్భంగా తీసుకున్నదిగా అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా, ధోనీకి తెలుగు రాష్ట్రాలతో అభినాభావ సంబంధం ఉంది. ఆయన తన కెరీర్ ఆరంభంలో విశాఖ వేదికగా దాయాదిపై సూపర్ శతకాన్ని(123 బంతుల్లో 148) నమోదు చేశాడు. ఈ మ్యాచ్ ద్వారానే ధోనీ అంతర్జాతీయ క్రికెట్లో పాపులర్ అయ్యాడు.
ఇదిలా ఉంటే, టీమిండియా క్రికెట్ చరిత్రలో సచిన్ తరువాత అంతటి పాపులారిటీని సొంతం చేసుకున్న ధోనీ.. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరికి ఫేవరేట్గా మారాడు. 2004లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి, అనతి కాలంలోనే కెప్టెన్గా ఎదిగిన మాహీ.. క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. 13 సంవత్సరాల పాటు క్రికెట్లో కొనసాగిన ధోనీ.. తన చివరి మ్యాచ్ను 2019 వన్డే ప్రపంచకప్లో ఆడాడు.