Leander Paes-Naresh Kumar: లియాండర్‌ పేస్‌ గురువు కన్నుమూత

15 Sep, 2022 10:50 IST|Sakshi

భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌.. తన గురువులా భావించే మాజీ టెన్నిస్‌ ప్లేయర్‌, డేవిడ్‌ కప్‌ మాజీ కెప్టెన్‌ నరేశ్‌ కుమార్‌ బుధవారం రాత్రి కన్నుమూశారు.16 ఏళ్ల టీనేజర్‌ లియాండర్‌ పేస్‌కు మెంటార్‌గా వ్యవహరించిన నరేశ్‌ కుమార్‌.. పేస్‌ తన కెరీర్‌లో ఎదగడంలో పరోక్షంగా కీలకపాత్ర పోషించాడు. ఇక 1990 డేవిస్‌ కప్‌లో పేస్‌కు మెంటార్‌గా వ్యహరించిన నరేశ్‌ కుమార్‌ నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌గా, ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

93 ఏళ్ల నరేశ్‌ కుమార్‌ గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున నిద్రలోనే మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యలు తెలిపారు. ఇక నరేశ్‌ కుమార్‌ 1928 డిసెంబర్‌ 22న లాహోర్‌లో జన్మించారు. ఆయనకు భార్య సునీత. కొడుకు అర్జున్‌, ఇద్దరు కూతుర్లు గీతా, ప్రియాలు సంతానం. 1949లో ఆసియా చాంపియన్‌షిప్స్‌ ద్వారా టెన్నిస్‌లో అరంగేట్రం చేసిన నరేశ్‌ కుమార్‌.. ఆ తర్వాత మరో టెన్నిస్‌ ప్లేయర్‌ రమానాథన్‌ కృష్ణన్‌తో కలిసి దాదాపు దశాబ్దానికి పైగా భారత్‌ నుంచి టెన్నిస్‌లో కీలకపాత్ర పోషించాడు.

ఇక 1952లో డేవిస్‌ కప్‌ జర్నీ ఆరంభించిన నరేశ్‌ కుమార్‌ ఆ తర్వాత భారత్‌ తరపున డేవిడ్‌ కప్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక 1955లో నరేశ్‌ కుమార్‌ తన టెన్నిస్‌ కెరీర్‌లో ఒక గోల్డెన్‌ ఇయర్‌ అని చెప్పొచ్చు. ఆ ఏడాది వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌లో సింగిల్స్‌ విభాగంలో భారత్‌ తరపున తొలిసారి నాలుగో రౌండ్‌కు చేరిన తొలి ఆటగాడిగా నిలిచాడు.అయితే నాలుగో రౌండ్‌లో అప్పటి టెన్నిస్‌ ప్రపంచ నెంబర్‌వన్‌ టోనీ ట్రేబర్ట్‌ చేతిలో ఓడినప్పటికి అతన్ని ముప్పతిప్పలు పెట్టి ఔరా అనిపించాడు. 


ఇక నరేశ్‌ కుమార్‌ ఖాతాలో ఐదు సింగిల్స్‌ టైటిల్స్‌ ఉన్నాయి. 1952, 1953లో ఐరిస్‌ చాంపియన్‌షిప్స్‌.. 1952లో వెల్ష్‌ చాంపియన్స్‌, 1957లో ఎసెక్స్‌ చాంపియన్‌షిప్స్‌లు సొంతం చేసుకున్నాడు. ఇక 1969లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో నరేశ్‌ కుమార్‌ తన ఆఖరి మ్యాచ్‌ ఆడాడు. అర్జున అవార్డు అందుకున్న నరేశ్‌ కుమార్‌.. 2000వ సంవత్సరంలో ద్రోణాచార్య లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్న తొలి భారత టెన్నిస్‌ కోచ్‌గా నిలిచారు.

మరిన్ని వార్తలు