రొటేషన్‌ పాలసీ మా కొంపముంచింది: హుస్సేన్‌

10 Mar, 2021 13:15 IST|Sakshi

అహ్మదాబాద్‌: టీమిండియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్‌ 3-1 తేడాతో ఓడిపోవడం వెనుక రొటేషన్‌ పాలసీ ముఖ్య కారణమని ఆ జట్టు మాజీ ఆటగాడు నాసిర్‌ హుస్సేన్‌ అభిప్రాయపడ్డాడు.  రొటేషన్‌ పాలసీ అనేది తప్పుడు నిర్ణయమని.. అది ఎప్పుడు కలిసి రాదని.. ఆ విధానాన్ని తప్పుబడుతున్నట్లు నాసిర్‌ విమర్శించాడు.

‘‘ఆటగాళ్ల రొటేషన్ విధానం అనే నిర్ణయం సరైనది కావొచ్చు..  కానీ భారత్‌తో సిరీస్‌లో అలా చేయడాన్ని సమర్థించలేను. ఆటగాళ్లను రొటేట్‌ చేయడం అన్ని సమయాల్లో కలిసిరాదు. టీమిండియా పర్యటనకు ముందు లంక పర్యటనలో రొటేషన్‌ పాలసీ కలిసి వచ్చింది.. అదే టీమిండియాతో సిరీస్‌కు వచ్చేసరికి పూర్తిగా మారిపోయింది. రెండో టెస్టు తర్వాత మొయిన్‌ అలీ స్వదేశానికి వెళ్లిపోయాడు. వాస్తవానికి అలీని మిగిలిన టెస్టుల్లో ఆడించాలని ఈసీబీ భావించింది. కానీ రొటేషన్‌ పాలసీ ఉండడంతో ఆటగాళ్లు తమ సొంత నిర్ణయాలపై ఆధారపడుతున్నారు.

జానీ బెయిర్‌ స్టో విషయంలోనూ ఇలాగే జరిగింది. లంకతో సిరీస్‌లో అద్భుతంగా రాణించిన బెయిర్‌ స్టో టీమిండియా సిరీస్‌ వచ్చేసరికి మాత్రం విఫలమయ్యాడు. మొదటి రెండు టెస్టులకు దూరంగా ఉన్న అతను చివరి రెండు టెస్టుల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే రొటేషన్‌ పాలసీ ఈసారి మా కొంపముంచింది. ఇంకో విషయం ఏంటంటే.. ఐపీఎల్‌ సీజన్‌కు కూడా ఆటగాళ్లు అందుబాటులో ఉండేలా ఈసీబీ చర్యలు తీసుకుంటే బాగుంటుంది.

ఐపీఎల్‌ 2020 ముగిసి ఆర్నెళ్లు కాకుండానే మరో సీజన్‌ రెడీ అయితుంది. ఐపీఎల్‌లో పాల్గొంటే.. ఫార్మాట్‌ వేరైనా.. టెస్టు క్రికెట్‌ ఆడేందుకు కాస్త స్కోప్‌ ఉంటుంది. '' అని వివరించాడు. ఇక ఇంగ్లండ్‌, టీమిండియాల మధ్య 5 టీ20ల సిరీస్‌లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్‌ శుక్రవారం(మార్చి 12న) జరగనుంది.
చదవండి: 
టీమిండియాతో సిరీస్‌.. ఐదు కేజీలు బరువు తగ్గా

టీమిండియా సిరీస్‌ గెలవగానే మాట మార్చేశాడు

మరిన్ని వార్తలు