'అక్కడ ప్రాణాలు పోతున్నాయి.. రద్దు చేయడం మంచిదే'

5 May, 2021 16:18 IST|Sakshi

లండన్‌: బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌కు కరోనా సెగ తగలడంతో సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అయితే లీగ్‌ రద్దు అనేది తాత్కాలికమే అని..  పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ ఐపీఎల్‌ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ 14వ సీజన్‌ను రద్దు చేయడం సరైనదని.. వారికి వేరే ఆప్షన్‌ లేదంటూ ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్ నాసర్‌ హుస్సేన్‌ అభిప్రాయపడ్డాడు. 

హుస్సేన్‌ మాట్లాడుతూ..'' భారత్‌లో కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ ఆటగాళ్లను బయోబబుల్‌ సెక్యూర్‌లో ఉంచి లీగ్‌ నిర్వహించారు. అత్యంత సురక్షితంగా చెప్పుకొనే బయోబబుల్‌కు కరోనా సెగ తగిలింది. ఈ సమయంలో లీగ్‌ను రద్దు చేయడం తప్ప మరో మార్గం లేదు. ఇప్పుడు తాత్కాలిక రద్దు మాత్రమే అని.. పరిస్థితి చక్కబడిన తర్వాత ఐపీఎల్‌ను జరిపి తీరుతామని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. నా దృష్టిలో మాత్రం ఈ సీజన్‌ను పూర్తిగా రద్దు చేయడమే ఉత్తమం. ఇప్పటికే పటిష్టమైన బయోబబూల్‌ను దాటి ఆటగాళ్లను చేరినా కరోనా భవిష్యత్తులో ఐపీఎల్‌ నిర్వహించినా అక్కడికి రాదని ఎవరు మాత్రం చెప్పగలరు.

అంతేగాక ఐపీఎల్‌ మళ్లీ నిర్వహించినా విదేశీ ఆటగాళ్లు వస్తారనేది అనుమానమే. ఎందుకంటే ఇప్పుడు భారత్‌లో కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయనేది వారి కళ్లతో చూశారు. ఆసుపత్రుల్లో బెడ్స్‌ దొరకక.. ఆక్సిజన్‌ కొరతతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంతటి భయానక పరిస్థితులు ఉన్న ఈ తరుణంలో లీగ్‌లో పాల్గొనేందుకు ఎలా వస్తారు. అయినా ఐపీఎల్‌ 14వ సీజన్‌ను ఇండియాలో నిర్వహించాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయం తప్పు. సరిగ్గా ఆరు నెలల క్రితం యూఏఈ వేదికగా నిర్వహించిన ఐపీఎల్‌ 13వ సీజన్‌ సక్సెస్‌ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా సీజన్‌ను అక్కడే నిర్వహించి ఉంటే బాగుండేది. పరిస్థితి దారుణంగా మారిన తర్వాత ఐపీఎల్‌ను రద్దు చేయడం తప్ప మరో మార్గం లేదు.'' అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: 'మీ అభిమానానికి థ్యాంక్స్‌.. జడేజా అని పిలిస్తే చాలు'

ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ కిడ్నాప్‌.. నలుగురు అరెస్ట్‌

మరిన్ని వార్తలు