ఆనంద్‌ మహీంద్రాకు నట్టూ రిటర్న్‌ గిఫ్ట్‌..

1 Apr, 2021 20:14 IST|Sakshi

చెన్నై: ఆస్ట్రేలియా పర్యటనలో సత్తాచాటిన భారత యువ క్రికెటర్లకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తమ సంస్థకు చెందిన ఎస్‌యూవీ థార్ వాహనాలను బహుమతిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ వాహనాన్ని అందుకున్న టీమిండియా సెన్సేషనల్‌ బౌలర్‌ టి నటరాజన్.. ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాదు ఆనంద్‌ మహీంద్రాకు నట్టూ రిటర్న్‌ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఈ విషయాన్ని నటరాజన్‌ గురువారం ట్విటర్ వేదికగా తెలియజేశాడు.

తనకు అందిన ఎస్‌యూవీ వాహనానికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేస్తూ.. "నా ప్రయాణాన్ని గుర్తించి నాకు అండగా నిలిచిన మీకు కృతజ్ఞతలు సర్(ఆనంద్‌ మహీంద్ర), భారత్ తరఫున క్రికెట్ ఆడే అవకాశం రావడం నాకు దక్కిన వరం, గొప్ప వ్యక్తుల నుంచి ప్రోత్సాహం లభించడం నాకు దక్కిన గౌరవం, నాకు బహుమతిగా ఇచ్చిన వాహనాన్ని ఈ రోజే నడిపాను, నా అరంగేట్ర టెస్ట్‌ మ్యాచ్‌ జెర్సీని మీకోసం పంపిస్తున్నాను" అంటూ క్యాప్షన్‌ జోడించి ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కాగా, నటరాజన్‌తో పాటు మహీంద్ర థార్‌ వాహనాలను సుందర్‌, శార్దూల్ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌, శుభ్‌మన్‌ గిల్‌, నవదీప్‌ సైనీలు అందుకున్నారు.

ఇదిలా ఉండగా, ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 సీజన్ కోసం నటరాజన్ సిద్దమవుతున్నాడు. గురువారమే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుతో చేరాడు. నిబంధనల మేరకు ఏడు రోజుల క్వారంటైన్‌లో ఉండనున్నాడు. గత సీజన్‌లో యార్కర్లతో అదరగొట్టిన నట్టూ ఈసారి అంతకుమించి రాణించాలని సన్‌రైజర్స్‌ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చెన్నై వేదిక ఏప్రిల్‌ 11న జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడనున్నాయి.
చదవండి: నా డార్లింగ్‌తో చివరి పెగ్‌: వార్నర్‌

మరిన్ని వార్తలు