2028 ఒలంపిక్స్‌ నాటికి పతకాల సాధనలో టాప్‌-10లో భారత్‌

29 Aug, 2020 12:59 IST|Sakshi

ఖేల్‌ రత్న అందుకున్న ఐదుగురిలో ముగ్గురు మహిళలు

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పలు రంగాల్లో రాణించిన క్రీడాకారులకు పురస్కారాలు అందజేశారు. ప్రతి ఏటా ఢిల్లీలోని సాయ్‌ కేంద్రంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కరోనా కారణంగా ఈ ఏడాది తొలిసారి వర్చువల్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తదితరులు హాజరయ్యారు. తన ప్రసంగంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు క్రీడా శాఖ మంత్రి. ఈ ఏదాడి కోవిడ్‌ కారణంగా క్రీడా కార్యక్రమాలకు అవాంతరం ఏర్పడిందన్నారు. 2028 ఒలంపిక్స్‌ నాటికి పతకాల సాధనలో భారత్‌ టాప్‌-10లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం దేశంలోని ప్రతిభావంతులైన అథ్లెట్లు, కోచ్‌లతో పాటు.. దేశంలో క్రీడలను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్న వివిధ సంస్థలను అవార్డులతో సత్కరించారు. ఈ సంవత్సరం ఖేల్‌ రత్న అవార్డు గ్రహీతల పేర్లను మొదట పిలిచారు, తరువాత ద్రోణాచార్య అవార్డు గ్రహీతలను ఆహ్వానించారు. (చదవండి: ఇదే నా నిరసన... )

ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, పుణె, చండీగఢ్‌, కోల్‌కతా, సోనపట్‌ వేదికగా ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది మొత్తం 74 మందికి అవార్డులు ప్రకటించగా.. వారిలో ఐదుగురికి రాజీవ్‌ ఖేల్‌ రత్న.. 27 మందికి అర్జున అవార్డులు అందజేశారు. ఈ ఏడాది ఖేల్‌ రత్న అవార్డులు అందుకున్న ఐదుగురిలో ముగ్గురు మహిళలు ఉండటం విశేషం. అవార్డు దక్కిన వారిలో కొందరు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. వారిలో రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌, స్టార్‌ ఇండియన్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ ఉన్నారు. కరోనా పాజిటివ్‌ రావడంతో వినేశ్‌‌ ఫోగట్‌ హాజరు కాలేదు. ఇక రోహిత్‌ శర్మ యూఏఈలోని ఐపీఎల్‌ కోసం సన్నద్దమవతున్నందున ఈ వేడుకకు దూరమయ్యారు. 

>
మరిన్ని వార్తలు