'నట్టూ.. నీకు కెప్టెన్‌ అయినందుకు గర్విస్తున్నా'

22 Jan, 2021 15:44 IST|Sakshi

ముంబై: ఆసీస్‌ టూర్‌ను విజయవంతం చేసుకొని స్వదేశానికి తిరిగివచ్చిన టీమిండియాకు గ్రాండ్‌ వెల్‌కమ్‌ లభించిన సంగతి తెలిసిందే. ఆసీస్‌ గడ్డపై వరుసగా రెండోసారి బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోపీ గెలవడంతో పాటు టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియాపై ఇంకా ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా ఆసీస్‌ పర్యటనకు నెట్‌ బౌలర్‌గా వెళ్లి ఆకట్టుకున్న టి.నటరాజన్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌.. ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ పొగడ్తలలో ముంచెత్తాడు.  

'మొదట నట్టూకు ఇవే నా అభినందనలు.. నువ్వు నిజంగా జీనియస్‌. ఐపీఎల్‌లో నీతో కలిసి ఆడినప్పుడు నీ మీద ఏ ఫీలింగ్‌ అయితే ఉండేది దాన్ని నిలబెట్టుకున్నావు. మ్యాచ్‌ వరకు మాత్రమే మనద్దిరం ప్రత్యర్థులం.. ఆఫ్‌ ఫీల్డ్‌లో మాత్రం ఎప్పటికి మంచి స్నేహితులం అన్న విషయం గుర్తుపెట్టుకో. నీలాంటి ఆటగాడికి నేను కెప్టెన్‌గా ఉన్నందుకు గర్విస్తున్నా. నిజంగా నటరాజన్‌ మంచి నిజాయితీ ఉన్న వ్యక్తి.. వికెట్‌ తీయగానే తన గొప్పతనాన్ని ప్రదర్శించకుండా హుందాగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. చదవండి: గబ్బా విజయం: రవిశాస్త్రి చెప్పిన మంత్రమిదే

ఐపీఎల్‌ 2020 సీజన్‌లో ఆడుతున్న సమయంలోనే నటరాజన్‌కు బిడ్డ పుట్టిందన్న వార్త తెలిసింది. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత పుట్టిన బిడ్డను చూడకుండా  నేరుగా ఆసీస్‌ పర్యటనకు రావడం గొప్ప విషయం. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే.. ఆసీస్‌ టూర్‌కు నటరాజన్‌ ముందు ఒక నెట్‌ బౌలర్‌గా మాత్రమే వచ్చాడు.. దేశం కోసం ఎవరైతే కుటుంబాన్ని కూడా త్యాగం చేస్తారో వారికి అవకాశం వెతుక్కుంటూ వస్తుందనేది నటరాజన్‌ విషయంలో మరోసారి నిరూపితమైంది. గత ఐపీఎల్‌లో 16 వికెట్లతో అద్భుత ప్రదర్శన కనబరిచిన నటరాజన్‌.. ఈసారి ఐపీఎల్‌లో ఎలాంటి ప్రదర్శన ఇస్తాడనే దానికోసం ఎదురుచూస్తున్నా. అతనికి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు.. పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్‌ చేయడం నటరాజన్‌ శైలి' అంటూ కొనియాడాడు.

కాగా నటరాజన్‌ ఆసీస్‌తో జరిగిన చివరి వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన నటరాజన్‌ మెయిడెన్‌ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత జరిగిన టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లాడి 6 వికెట్లు తీసి సత్తా చాటాడు. అనంతరం టెస్టు సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో​ అవకాశం రాకున్నా .. చివరిదైన గబ్బా టెస్టులో ఆడి తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 3 వికెట్లు తీయడం విశేషం. 32 ఏళ్లుగా బ్రిస్బేన్‌లో ఓటమి ఎరుగని ఆసీస్‌ జైత్రయాత్రకు చెక్‌ పెట్టిన టీమిండియా తుది జట్టులో​ నటరాజన్‌ ఉండడం అతని అదృష్టమనే చెప్పొచ్చు. చదవండి: సీఏదే తప్పు.. గబ్బాలో మొదటి టెస్టు నిర్వహించాల్సింది

మరిన్ని వార్తలు