‘కెప్టెన్‌ అడిగితే కాదనగలమా’

24 Jan, 2021 00:00 IST|Sakshi

గాయంతో బౌలింగ్‌ చేయడంపై నవదీప్‌ సైనీ

న్యూఢిల్లీ: సిడ్నీ టెస్టుతో అరంగేట్రం చేసిన పేస్‌ బౌలర్‌ నవదీప్‌ సైనీ... తన రెండో మ్యాచ్‌ బ్రిస్బేన్‌కు వచ్చేసరికి గాయపడిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 7.5 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అనంతరం గజ్జల్లో గాయంతో బౌలింగ్‌ నుంచి తప్పుకున్నాడు. అయితే ప్రధాన పేసర్‌ ఒకరు లేకపోతే సమస్య రావచ్చని భావించిన కెప్టెన్‌ రహానే... రెండో ఇన్నింగ్స్‌లో సైనీ బౌలింగ్‌ చేస్తే బాగుంటుందని భావించాడు. కెప్టెన్‌ కోరడంతో వెంటనే సిద్ధమయ్యానని సైనీ చెప్పాడు.

‘నేను బాగానే బౌలింగ్‌ చేస్తున్న దశలో ఒక్కసారిగా గాయపడ్డాను. ఇంత కాలం తర్వాత అవకాశం వస్తే ఇలా జరిగిందేమిటని అనుకున్నాను. రెండో ఇన్నింగ్స్‌ సమయంలో గాయంతో బౌలింగ్‌ చేయగలవా అని అజింక్య భాయ్‌ అడిగాడు. నేను వెంటనే సరేనని చెప్పేశాను. మళ్లీ బౌలింగ్‌ చేస్తే గాయం తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిసినా... అప్పటి పరిస్థితులను బట్టి చూస్తే కెప్టెన్‌ అడిగితే కాదనగలమా. ఇందులో ఇక ఆలోచించడానికేమీ లేదనిపించింది. పైగా జట్టు కోసం ఆడే ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. అందుకే నొప్పి బాధిస్తున్నా జట్టు కోసం నేను చేయగలిగింది చేద్దామని నిర్ణయించుకున్నా’ అని సైనీ వెల్లడించాడు. 

>
మరిన్ని వార్తలు