Neeraj Chopra: '90 మీటర్ల దూరం విసిరినా పతకం రాకపోతే'

10 Sep, 2022 16:18 IST|Sakshi

అథ్లెటిక్స్‌ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో భారత జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా గురువారం విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. రెండో ప్రయత్నంలో ఈటెను 88.44 మీటర్ల దూరం విసిరి ఎవరికి అందనంతో ఎత్తులో నిలిచిన నీరజ్‌.. అ‍గ్రస్థానంలో నిలిచి తొలిసారి ట్రోఫీని అందుకున్నాడు.

అయితే టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత నీరజ్‌ చోప్రా ఇప్పటికే చాలా ఈవెంట్స్‌లో పాల్గొన్నప్పటికి అతని అత్యధిక దూరం 89.94 మీటర్లుగా ఉంది. ఈ ఏడాది జూన్‌ 30న జరిగిన స్టాక్‌హోమ్‌ డైమండ్‌ లీగ్‌లో నీరజ్‌ దీనిని అందుకున్నాడు. అయితే నీరజ్‌ 90 మీటర్లు మార్క్‌ ఎప్పుడు అందుకుంటాడా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

తాజాగా డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన అనంతరం నీరజ్‌ చోప్రా మీడియాతో సుధీర్ఘంగా మాట్లాడాడు. ‘జావెలిన్‌ను 90 మీటర్లు విసిరేందుకు ప్రయత్నించా. దానిని అందుకోలేకపోయినా బాధపడటం లేదు. ఎందుకంటే డైమండ్‌ ట్రోఫీ గెలవడం అన్నింటికంటే ముఖ్యం. అది నేను సాధించాను. 90 మీటర్ల మార్క్‌ అనేది పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంది. దానిని అందుకొని కూడా పతకం గెలవకపోతే వృథా కదా!

ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత ఆటగాళ్లకు గుర్తింపు రావడం కూడా ఎంతో అవసరం.  అన్నింటికి మించి నా కుటుంబం కూడా ఇక్కడే ఉంది. తొలిసారి వారంతా నేను పాల్గొన్న ఒక అంతర్జాతీయ ఈవెంట్‌కు హాజరయ్యారు. మరో వైపు నాపై ఇప్పటికే అంచనాల ఒత్తిడి తీవ్రంగా ఉంది. కొత్తగా ఒత్తిడి పెంచుకోలేను. అందరూ ఇప్పుడు స్వర్ణమే ఆశిస్తున్నారు. నేను వంద శాతం ప్రయత్నిస్తాను కానీ అది ఎప్పుడూ సాధ్యం కాదని అందరూ అర్థం చేసుకోవాలి’ అంటూ తెలిపాడు.       

చదవండి: Neeraj Chopra: ఎదురులేని నీరజ్‌ చోప్రా.. పట్టిందల్లా బంగారమే

మరిన్ని వార్తలు