Neeraj Chopra: నా బయోపిక్‌లో ఆ ఇ‍ద్దరిలో ఎవరైనా ఓకే..!

10 Aug, 2021 11:59 IST|Sakshi

న్యూఢిలీ​: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున జావెలిన్ త్రో విభాగంలో బంగారు పతకం సాధించి రాత్రికిరాత్రి  హీరోగా మారిపోయిన నీరజ్ చోప్రా.. గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రస్తావించిన విషయం ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 2018 ఆసియా క్రీడలు ముగిసిన అనంతరం ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నీరజ్‌ చోప్రా మాట్లాడుతూ.. నా బయోపిక్‌ తీయాలనే ప్రతిపాదన గొప్ప అనుభూతిని కలిగిస్తోంది. ఒక వేళ ఇది సాధ్యపడితే.. అందులో మా రాష్ట్రానికి(హరియాణా) చెందిన బాలీవుడ్ నటుడు రణ్‌దీప్‌ హుడా లేదా బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ అక్షయ్‌ కుమార్‌‌లలో ఎవరు నటించినా బాగుంటుందంటూ చెప్పుకొచ్చాడు. 

దాదాపు మూడేళ్ల క్రితం అతను అన్న ఈ మాటలపై ప్రస్తుతం నెట్టింట చర్చ మొదలైంది. పలానా పలానా హీరో అయితే బాగుంటుందంటూ నెటిజన్లు పోటీ పడి సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే, టోక్యోలో స్వర్ణం సాధించిన అనంతరం ఈ హీరోలిద్దరూ నీరజ్‌కు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేయడం విశేషం. వీటిలో అక్షయ్ కుమార్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. అక్షయ్‌‌కు మరో కొత్త సినిమా దొరికేసిందంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తు్న్నారు. ఈమేరకు గతంలో అక్షయ్ కుమార్ బల్లెంతో దిగిన ఓ ఫొటోను షేర్‌ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు. నీరజ్ చోప్రా బయోపిక్‌ సెట్స్‌ నుంచి లీకైన ఫొటోలంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా ఒలింపిక్స్‌ ట్రాక్ అండ్ ఫీల్డ్‌ విభాగంలో స్వర్ణం సాధించిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన నీరజ్‌ చోప్రా పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. ఒలింపిక్స్‌కు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలోపే ఉన్న అతని ఫాలోవర్లు.. స్వర్ణం గెలిచిన కొద్ది గంటల్లోనే  అమాంతం 30లక్షలకు పెరిగారు. అథ్లెట్‌గా స్వర్ణం సాధించాడనే విషయమే కాకుండా అతని స్టైల్‌కి కూడా నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
 

మరిన్ని వార్తలు