ఇంగ్లండ్ వన్డే జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం ప్రస్తుతం నెదర్లాండ్స్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడి 11 నెలలు కావొస్తుంది. గ్యాప్ చాలా వచ్చిందనో ఏమో కానీ శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ నెదర్లాండ్స్ ఆటగాళ్లకు ఏకంగా విశ్వరూపం చూపించింది. డచ్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్న ఇంగ్లండ్ బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. తమ క్రికెట్ చరిత్రలోనే ఇంగ్లండ్ వన్డేల్లో అత్యధిక స్కోరు (50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 498 పరుగులు) నమోదు చేసింది. ముగ్గురు ఇంగ్లండ్ బ్యాటర్లు సెంచరీలతో చెలరేగడం విశేషం. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 49.4 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఇంగ్లండ్ జట్టు 232 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
అయితే ఇదే మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నెదర్లాండ్స్ లాంటి చిన్న జట్లకు క్రికెట్ ఆడే అవకాశాలు తక్కువగా వస్తాయి. అలాంటి వారి దేశంలో అంతర్జాతీయ మ్యాచ్లు జరగడం అరుదుగా జరుగుతుంటుంది. అందుకే డచ్ దేశంలో ఉన్న క్రికెట్ స్టేడియాల్లో చెట్లు విపరీతంగా పెరిగిపోవడంతో మైదానం పరిసరాలు అడవిని తలపిస్తున్నాయి. అయితే ఇంగ్లండ్ పర్యటనకు రావడంతో అప్పటికప్పుడు స్టేడియాలను సిద్ధం చేసినప్పటికి చెట్లను మాత్రం తొలగించలేకపోయారు.
తాజాగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో నెదర్లాండ్స్ ఆటగాళ్లు ఘోస మాములుగా లేదు. ఇంగ్లండ్ బ్యాటర్లు కొట్టే కొట్టుడుకు బంతులన్నీ వెళ్లి స్టేడియం అవతల ఉన్న చెట్ల పోదల్లోకి వెళ్లిపోయాయి. దీంతో డచ్ ఆటగాళ్లు పదే పదే పొదల్లోకి దూరి బంతి కోసం వెతుకులాట చేయడం ఆసక్తిగా మారింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మధ్యలో డేవిడ్ మాలన్.. నెదర్లాండ్స్ కెప్టెన్ పీటర్ సీలర్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదాడు. ఆ బంతి వెళ్లి స్టేడియంలో అవతల ఉన్న చెట్ల పొదల్లో పడింది. బంతిని వెతకడానికి నెదర్లాండ్స్ జట్టులో దాదాపు సగం మంది సభ్యులు చెట్లు, పుట్టల్లోకి వెళ్లాల్సి వచ్చింది. అంతమంది ఒకేసారి వెతికితే గానీ రెండు నిమిషాలకు బంతి కనిపించడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Drama in Amstelveen as the ball ends up in the trees 🔍 pic.twitter.com/MM7stEMHEJ
— Henry Moeran (@henrymoeranBBC) June 17, 2022
చదవండి: వన్డేల్లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. 498 పరుగుల భారీ స్కోర్