ఇంగ్లండ్‌కు షాకిచ్చిన కివీస్‌.. 21 ఏళ్ల తర్వాత సిరీస్‌ కైవసం 

13 Jun, 2021 17:37 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌: ఆతిధ్య ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. లార్డ్స్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ను అతికష్టం మీద డ్రా చేసుకోగలిగిన ఇంగ్లండ్‌.. రెండో టెస్ట్‌లో మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఈ విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-0తేడాతో కైవసం చేసుకున్న పర్యాటక జట్టు.. 21 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ గడ్డపై సిరీస్‌ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌.. తొలి ఇన్నింగ్స్‌లో రోరీ బర్న్స్‌(81), లారెన్స్‌(81 నాటౌట్‌) రాణించడంతో 303 పరగులు స్కోర్‌ చేసింది. బౌల్ట్‌కు 4, హెన్రీ 3, అజాజ్‌ పటేల్‌ 2, వాగ్నర్‌కు ఓ వికెట్‌ దక్కింది. అనంతరం కాన్వే(80), యంగ్‌(82), రాస్‌ టేలర్‌(80) అర్ధసెంచరీలతో రాణించడంతో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 388 పరుగులకు ఆలౌటైంది. 

ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌కు 4 వికెట్లు దక్కాయి. అయితే ఆతర్వాత రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్‌ పేసర్లు దారుణంగా దెబ్బకొట్టారు. మ్యాట్‌ హెన్రీ(3/36), వాగ్నర్‌ (3/18), బౌల్ట్‌ (2/34) ధాటికి ఇంగ్లండ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 122కే ఆలౌటైంది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో మార్క్‌ వుడ్‌(29) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో న్యూజిలాండ్ గెలుపుకు ‌.. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 85 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించి 38 పరగులు అవసరమైంది. ఈ లక్ష్యాన్ని కివీస్‌ 2 వికెట్లు కోల్పోయి ఛేదించి, 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఇంగ్లండ​ బౌలర్లు బ్రాడ్‌, స్టోన్‌కు తలో వికెట్‌ దక్కగా, ప్లేయర్‌ ఆఫ్ మ్యాచ్‌ అవార్డు మ్యాట్‌ హెన్రీకి‌, ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు డెవాన్‌ కాన్వే, ఇంగ్లండ్‌ ఓపెనర్‌ రోరీ బర్న్స్‌కు సంయుక్తంగా దక్కింది.  
చదవండి: శతక్కొట్టిన పంత్‌.. ఫిఫ్టీతో ఆకట్టుకున్న గిల్‌

మరిన్ని వార్తలు