హామిల్టన్: స్వదేశంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్లో న్యూజిలాండ్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన తొలి టి20 మ్యాచ్లో న్యూజిలాండ్ 66 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత న్యూజిలాండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 210 పరుగులు చేసింది. కాన్వే (52 బంతుల్లో 92 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్స్లు) మరోసారి చెలరేగాడు. అతడు విల్ యంగ్ (30 బంతుల్లో 53; 2 ఫోర్లు, 4 సిక్స్లు)తో కలిసి మూడో వికెట్కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ జట్టును ఇష్ సోధీ (4/28), ఫెర్గూసన్ (2/25) దెబ్బతీయడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసి ఓడిపోయింది. ఈ సిరీస్కు ముందు జరిగిన వన్డే సిరీస్ను కివీస్ క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. బంగ్లాతో మూడు వన్డేల సిరీస్ను 3-0 తేడాతో కివీస్ కైవసం చేసుకుంది.