T20 WC 2021: న్యూజిలాండ్‌కు షాక్‌ల మీద షాక్‌లు.. గాయంతో స్టార్‌ బౌలర్‌ ఔట్‌

27 Oct, 2021 17:02 IST|Sakshi

Lockie Ferguson Ruled Out Of T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌-2021లో న్యూజిలాండ్ జట్టుకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలై కుంగిపోయి ఉన్న ఆ జట్టుకు పుండు మీద కారం చల్లినట్లుగా గాయాల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. తొలుత పాక్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ గాయపడి భారత్‌తో కీలక మ్యాచ్‌కు దూరం కాగా.. తాజాగా ఆ జట్టు ప్రధాన పేసర్ ఫెర్గూసన్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. కాలి గాయంతో బాధపడుతున్న ఫెర్గూసన్‌కు ఎంఆర్ఐ స్కానింగ్‌లో ఫ్రాక్చర్ అని తేలడంతో వైద్యులు అతన్ని విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో న్యూజిలాండ్ బోర్డు ప్రపంచకప్ జట్టును నుంచి ఫెర్గూసన్‌ను తప్పించి, అతని స్థానంలో ఆడమ్ మిల్నేను జట్టులోకి తీసుకుంది. 

ఇదిలా ఉంటే, పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌-న్యూజిలాండ్ మధ్య ఈనెల 31న జరగనున్న మ్యాచ్‌ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ టోర్నీలో సెమీస్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌లో తప్పకుండా గెలవడం చాలా ముఖ్యం. భారత్, న్యూజిలాండ్‌ జట్లు పాక్‌ చేతిలో పరాజయం పాలవ్వడమే ప్రస్తుత పరిస్థితికి కారణం. కాగా, గ్రూప్-2లో భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, జట్లతో పాటు బలహీనమైన అఫ్గానిస్థాన్‌, స్కాట్లాండ్, నమీబియా జట్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఆరు జట్ల నుంచి కేవలం రెండు జట్లకు మాత్రమే సెమీస్‌కు చేరే ఛాన్స్‌ ఉండడం.. పాక్‌ సెమీస్‌ బెర్తు దాదాపు ఖరారు కావడంతో మిగిలిన ఒక్క బెర్త్‌ కోసం భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య పోటీ నెలకొంది. 
చదవండి: T20 WC 2021: అక్తర్‌కు ఘోర అవమానం.. లైవ్‌లో పరువు తీసిన హోస్ట్‌

మరిన్ని వార్తలు