IND vs NZ: క్రికెట్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. ఉప్పల్‌ వేదికగా మరో సూపర్‌ మ్యాచ్‌

8 Dec, 2022 13:46 IST|Sakshi

భారత క్రికెట్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం మరో అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దమైంది. వచ్చే ఏడాది జనవరిలో భారత పర్యటనకు న్యూజిలాండ్‌ జట్టు రానుంది. హోం సిరీస్‌లో భాగంగా భారత జట్టు కివీస్‌తో మూడు వన్డేలు, టీ20ల సిరీస్‌ ఆడనుంది.

వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే జనవరి 18న ఉప్పల్‌ వేదికగా జరగనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. కాగా చివరగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఉప్పల్‌ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియాతో సిరీస్‌ డిసైడర్‌ ఆఖరి టీ20 మ్యాచ్‌ జరిగింది. 

ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలి వచ్చారు. అయితే మరోసారి హైదరాబాద్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌ జరగనుండడంతో అభిమానులు పండగ చేసుకోనున్నారు. ఇక న్యూజిలాండ్‌తో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ప్రకటించింది.

శ్రీలంక భారత పర్యటన: జనవరి 3- జనవరి 15
టీ20 సిరీస్‌తో ఆరంభం- వన్డే సిరీస్‌తో ముగింపు

న్యూజిలాండ్‌ భారత పర్యటన: జనవరి 18- ఫిబ్రవరి 1
వన్డే సిరీస్‌తో మొదలు- టీ20 సిరీస్‌తో ముగింపు

ఆస్ట్రేలియా భారత పర్యటన: ఫిబ్రవరి 13- మార్చి 22
టెస్టు సిరీస్‌తో ప్రారంభం- వన్డే సిరీస్‌తో ముగింపు

మరిన్ని వార్తలు