పాకిస్తాన్‌తో సిరీస్‌ అంటే వణికిపోతున్న కివీస్‌ ఆటగాళ్లు!

20 Aug, 2021 16:50 IST|Sakshi

Taliban Effect On New Zealand vs Pakistan Series:
ఆక్లాండ్‌: 18 ఏళ్ల తర్వాత పాక్‌లో పర్యటించనున్న న్యూజిలాండ్ జట్టును తాలిబన్ల భయం వేధిస్తోంది. పాక్ పొరుగు దేశమైన అఫ్గనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో కివీస్ ఆటగాళ్లు భయభ్రాంతులకు లోనై పాక్‌ పర్యటనకు ససేమిరా అంటున్నారు. ఆటగాళ్ల ఆందోళనపై స్పందించిన న్యూజిలాండ్ బోర్డు అంతర్జాతీయ సెక్యూరిటీ కన్సల్టెంట్ నిపుణుడు రెగ్ డికాసన్‌ను ఆశ్రయించింది. ఈ వారం తర్వాత పాకిస్థాన్‌ను సందర్శించి ఆటగాళ్ల భద్రత, కోవిడ్‌కు సంబంధించిన పరిస్థితులపై అంచనా వేయాలని కోరింది.

ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా పాక్‌ పర్యటనపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 3 వరకు న్యూజిలాండ్‌ జట్టు పాక్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లు జరగనున్నాయి. వన్డే సిరీస్‌కు రావల్పిండి, లాహోర్‌ మైదానాలు వేదికకానుండగా, టీ20 సిరీస్‌ మొత్తానికి లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

ఇదిలా ఉంటే, పాక్‌ పర్యటనకు న్యూజిలాండ్‌ రెగ్యులర్‌ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, డెవాన్ కాన్వే, ఫెర్గూసన్, కైల్ జెమీసన్, టిమ్ సీఫెర్ట్, జిమ్మీ నీషమ్, మిచెల్ శాంట్నర్‌లు అందుబాటులో ఉండమని ఇదివరకే ప్రకటించారు. వీరందరూ ఐపీఎల్ కారణంగా పాక్‌ పర్యటనకు డుమ్మా కొట్టాలని నిర్ణయించుకున్నారు. విలియమ్సన్ గైర్హాజరీలో పాక్‌లో పర్యటించే కివీస్ జట్టుకు సీనియర్ బ్యాట్స్‌మన్ టామ్ లాథమ్ సారథ్యం వహించనున్నాడు. 
చదవండి: అఫ్గాన్లు ప్రపంచకప్‌ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు..
 

మరిన్ని వార్తలు