న్యూజిలాండ్‌ క్రికెట్ జ‌ట్టుకు బాంబు బెదిరింపు..

21 Sep, 2021 18:01 IST|Sakshi

లండ‌న్‌: 3 టీ20లు, 5 వన్డేల సిరీస్‌ నిమిత్తం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న న్యూజిలాండ్ మ‌హిళా క్రికెట్ జ‌ట్టుకు బాంబు బెదిరింపు వ‌చ్చింది. లీసెస్ట‌ర్‌ వేదికగా న్యూజిలాండ్‌ మహిళలు, ఇంగ్లండ్‌ మహిళల మధ్య ఇవాళ(సెప్టెంబర్‌ 21) జరగాల్సిన మూడో వన్డేకు కొద్ది గంటల ముందు ఓ గుర్తు తెలియని అగంతకుడు ఈ మెయిల్‌ ద్వారా బాంబు బెదిరింపుకు పాల్పడినట్లు ఇరు దేశాల క్రికెట్‌ బోర్డులు దృవీకరించాయి. కివీస్‌ బృందం బస చేస్తున్న హోటల్‌ను బాంబు పెట్టి పేల్చేస్తామని సదరు అగంతకుడు కివీస్‌ మేనేజ్‌మెంట్‌లోని ఓ వ్యక్తికి మెయిల్‌ చేశాడు. అయితే ఈ బెదిరింపు నమ్మదగదిగా లేదని ఇరు దేశాల క్రికెట్‌ బోర్డులు కొట్టిపారేయడం విశేషం. 

ఇదిలా ఉంటే, ఇటీవ‌ల కివీస్ పురుషుల జ‌ట్టు భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా పాకిస్థాన్‌ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా బెదిరింపులు వ‌చ్చి ఉండవచ్చని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ బాంబు బెదిరింపు తర్వాత కివీస్ మేల్‌ క్రికెటర్లు భ‌యాందోళ‌న‌లకు గురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్టేడియం బ‌య‌ట త‌మ ఆట‌గాళ్ల‌పై దాడులు జ‌రిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కివీస్ ప్ర‌ధాని జెసిండా.. పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కాగా, పాక్‌ పర్యటన నుంచి న్యూజిలాండ్‌ జట్టు వైదొలిగిన తర్వాత ఇంగ్లండ్‌ జట్టు సైతం పాక్‌ టూర్‌ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.
చదవండి: అఫ్గాన్‌లో ఐపీఎల్‌ ప్రసారాలపై నిషేధం.. మహిళలే కారణమట..!

మరిన్ని వార్తలు