దుమ్మురేపిన కాన్వే.. రాహుల్‌ మాత్రం అక్కడే

3 Mar, 2021 17:36 IST|Sakshi

దుబాయ్‌: ఐసీసీ బుధవారం విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ 816 పాయింట్లతో రెండో స్థానం నిలుపుకోగా.. విరాట్‌ కోహ్లి మాత్రం 697 పాయింట్లతో ఆరో స్థానానికి పరిమితమయ్యాడు. ఇక ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌ 915 పాయింట్లతో టాప్‌ స్థానాన్ని నిలుపుకోగా.. పాక్‌ ఆటగాడు బాబర్‌ అజమ్‌ 801 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆరోన్‌ ఫించ్(ఆస్ట్రేలియా)‌, వాన్‌ డెర్‌ డసెన్‌(దక్షిణాఫ్రికా) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇక క్రైస్ట్‌ చర్చి వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో  99* పరుగుల దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ డెవోన్‌ కాన్వే తన కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్‌ను సాధించాడు. కాన్వే 46 స్థానాలు ఎగబాకి 17వ స్థానంలో నిలవగా.. కివీస్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ 97 పరుగుల నాకౌట్‌ ఇన్నింగ్స్‌తో 11వ స్థానంలో నిలిచాడు.


ఇక బౌలర్ల విషయానికి వస్తే.. ఆఫ్ఘన్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ 736 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా.. తబ్రేయిజ్‌ షంషీ(దక్షిణాఫ్రికా) 733 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా..ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌ 730 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. టీమిండియా బౌలర్లలో టాప్‌ టెన్‌లో ఒక్కరు కూడా లేరు. ఇక ఆల్‌రౌండర్‌ కోటాలో మహ్మద్‌ నబీ 294 పాయింట్లతో మొదటి స్థానంలో.. బంగ్లా ఆల్‌రౌండర్‌ షకీబ్‌ ఆల్‌ హసన్‌ రెండో స్థానంలో.. ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ మూడో స్థానంలో ఉన్నాడు.
చదవండి: కివీస్‌పై ఆసీస్‌ ఘన విజయం: ఆర్సీబీ ఫ్యాన్స్‌ హర్షం!

మరిన్ని వార్తలు