రైనాకు ఏదైనా జరగకూడనిది జరిగితే..!

7 Sep, 2020 08:23 IST|Sakshi

రైనా గురించి స్పష్టత లేదు 

ఐపీఎల్‌ పునరాగమనంపై బీసీసీఐ అధికారి వ్యాఖ్య

ముంబై: చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే) ఆటగాడు సురేశ్‌ రైనా ఐపీఎల్‌ ఆడేందుకు తిరిగి జట్టుతో చేరతాడా? లేదా? అనే అంశంపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారి ఒకరు అన్నారు. అర్ధాంతరంగా రైనా లీగ్‌ నుంచి ఎందుకు తప్పుకున్నాడనే దానిపై కూడా బీసీసీఐకి స్పష్టత లేదని పేర్కొన్నాడు. ‘బీసీసీఐ ముందుగా ఏం చేయాలంటే రైనా భారత్‌కు తిరిగి రావడం వెనకున్న కారణాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ కుటుంబం కోసం వస్తే అది అతని వ్యక్తిగత సమస్య. లేదా కెప్టెన్‌ ధోనితో అభిప్రాయబేధాలు అయితే అది సీఎస్కే అంతర్గత విషయం. డిప్రెషన్‌ కారణమైతే అది మానసిక సమస్య. రైనా డిప్రెషన్, ఆందోళనలో ఉన్నట్లయితే మేం అతన్ని వెళ్లనిచ్చేవాళ్లం కాదు. ఒకవేళ ఏదైనా జరగకూడనిది జరిగితేఎవరు బాధ్యత వహిస్తారు’ అని ఆయన వ్యాఖ్యానించాడు.

రైనా ఏదైనా కౌన్సెలింగ్‌ తీసుకుంటున్నాడో లేదో అనే అంశంపై బోర్డుకు ఇప్పటికి కూడా స్పష్టత లేకపోవడం గమనార్హం.ఈ విషయాలన్నింటిపై స్పష్టత వచ్చే వరకు రైనాను ఐపీఎల్‌కు అనుమతించేందుకు బీసీసీఐ సుముఖంగా లేదు. మరోవైపు రైనా కూడా తాను తిరిగి రావడం వెనకున్న బలమైన కారణాన్ని చెప్పడం లేదు. ఒకసారి సీఎస్కే బయోబబుల్‌ పటిష్టంగా లేదన్న రైనా మరోసారి తన కుటుంబానికి జరిగిన అన్యాయం కారణంగానే వెనక్కి వచ్చానని చెప్తున్నాడు. ఇటీవలే పఠాన్‌కోట్‌లో ఉండే రైనా దగ్గరి బంధువుల ఇంటిపై నలుగురు దుండగులు భయంకర దాడి చేసి అతని మేనమామను హత్య చేశారు.   
(చదవండి: సీఎస్‌కేకు మరో ఎదురుదెబ్బ!)
(చదవండి: శానిటైజర్‌ను ఇలా కూడా వాడొచ్చా!)

మరిన్ని వార్తలు