కోహ్లిపై టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు 

10 Sep, 2022 16:06 IST|Sakshi

భారత మాజీ క్రికెటర్‌, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌.. టీమిండియా తాజా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. ఒక్క సెంచరీ కూడా చేయకుండా మూడేళ్ల పాటు టీమిండియాలో కొనసాగడం కోహ్లి ఒక్కడికే సాధ్యమైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, అజింక్య రహానే లాంటి వారు పలు సందర్భాల్లో సెంచరీ చేయకపోవడంతో జట్టు నుంచి తప్పించబడ్డారని గుర్తు చేశాడు. 

ప్రస్తుత తరం క్రికెటర్లు అరుదుగా లభించే రెండు మూడు అవకాశాల్లో సెంచరీ చేయలేకపోతే వేటు తప్పదన్న విషయాన్ని ప్రస్తావించాడు. యువ క్రికెటర్లు ఇలా 1000 రోజులు సెంచరీ లేకుండా కొనసాగడమన్నది ఊహకందని విషయమని అన్నాడు. అయితే, కోహ్లి గత రికార్డులే అతన్ని జట్టులో కొనసాగేలా చేశాయని గంభీర్‌ వ్యాఖ్యానించడం కొసమెరుపు. 

కోహ్లి సెంచరీ సాధించిన అనంతరం స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ గంభీర్‌ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. గంభీర్‌.. కోహ్లికి వ్యతిరేకంగా చేసిన ఈ వ్యాఖ్యలు రన్‌మెషీన్‌ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. గంభీర్‌ గతంలో జరిగిన విషయాలను మనసులో పెట్టుకుని కోహ్లిని తరుచూ టార్గెట్‌ చేయడం అలవాటుగా మరిందని వారు కామెంట్లు చేస్తున్నారు. కోహ్లి గత చరిత్ర ఘనంగా ఉంది కాబట్టే అతన్ని జట్టులో కొనసాగించారని, అతనికే బోర్డు పెద్దల మద్దతు ఉంటే కెప్టెన్‌గా కూడా కొనసాగేవాడని అంటున్నారు. 

ఓ టాలెంటెడ్‌ ఆటగాడు అష్టకష్టాలు పడి తిరిగి ఫామ్‌ను అందుకుంటే మెచ్చుకోవాలే కానీ ఇలా అక్కసు వెళ్లగక్కకూడదని చురకలంటిస్తున్నారు. కాగా, ఆసియా కప్‌-2022లో భాగంగా గురువారం ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి కెరీర్‌లో 71 సెంచరీ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో 1020 రోజుల తర్వాత కోహ్లి ఈ సెంచరీ చేశాడు. కోహ్లి చివరిసారి 2019 నవంబర్‌లో సెంచరీ సాధించాడు. 
చదవండి: కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌ ఏంటి.. ఎప్పుడు తగ్గాడని మళ్లీ పుంజుకోవడానికి..?

>
మరిన్ని వార్తలు