బట్లర్‌ జట్టులో విధ్వంసకర వీరులకు దక్కని చోటు

16 May, 2021 21:11 IST|Sakshi

లండన్: ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్, రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ ఐపీఎల్ ఆల్‌ టైమ్ బెస్ట్ ఎలెవెన్‌ను ఎంపిక చేశాడు. ఈ జట్టులో తనతో పాటు టీమిండియా స్టార్‌ ఓపెనర్‌, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను మరో ఓపెనర్‌గా ప్రకటించాడు. అయితే బట్లర్‌ ఎంపిక చేసిన జట్టులో విధ్వంసకర వీరులైన గేల్‌, వార్నర్‌, ధవన్‌లకు చోటు దక్కకపోవడం గమనార్హం. వీరితో పాటు అతను మిస్టర్‌ ఐపీఎల్‌ రైనాను కూడా పక్కన పెట్టాడు. 

మిడిలార్డర్‌లో టీమిండియా కెప్టెన్‌, ఆర్‌సీబీ సారధి విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, సీఎస్‌కే సారధి ధోనీలను తీసుకున్నాడు. ధోనీని ఆరాధ్య క్రికెటర్‌గా భావించే బట్లర్‌.. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా ఎంచుకున్నాడు. ఇక ఆటకు దూరంగా ఉన్న మిస్టర్ 360 ఆటగాడు డివిలియర్స్‌ను ఎంపిక చేయడాన్ని ఆయన సమర్ధించుకున్నాడు. ఆల్‌రౌండర్ల కోటాలో విండీస్‌ విధ్వంసకర యోధుడు పోలార్డ్‌, రవీంద్ర జడేజా‌లను ఎంపిక చేశాడు. 

ఇక బౌలింగ్‌ విషయానికొస్తే.. పేస్ విభాగాన్ని భారత పేసు గుర్రం బుమ్రా, భువనేశ్వర్ కుమార్, లసిత్ మలింగాలతో భర్తీ చేశాడు. ఈ ముగ్గురు కొత్త బంతిని స్వింగ్ చేయడంతో పాటు డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంలో సమర్ధులని వీరి వైపు మొగ్గు చూపానన్నాడు. స్పిన్‌ విభాగంలో జడేజాకు తోడుగా హర్భజన్ సింగ్‌ను ఎంపిక చేసుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో 150కి పైగా వికెట్లు తీసిన హర్భజన్ అనుభవం జట్టుకు కలిసొస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు. 

జట్టు వివరాలు: జోస్ బట్లర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోనీ(కీపర్), కీరన్ పొలార్డ్, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, లసిత్ మలింగా.  చదవండి: కరోనా కాటుకు మాజీ క్రికెటర్‌ బలి

మరిన్ని వార్తలు