IND Vs SA 2022: 'టీమిండియాను ఓడించడం అంత ఈజీ కాదు.. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై ఒత్తిడి ఉంది'

16 Jun, 2022 09:14 IST|Sakshi

వైజాగ్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా అద్భుతమైన పునరాగమనం చేసింది. దీంతో సిరీస్‌ ఆశలను భారత్‌ సజీవంగా నిలుపుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్-ఉల్-హక్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. స్వదేశంలో భారత జట్టు అంత తేలికగా ఓడిపోదని, ప్రస్తుతం‍ దక్షిణాఫ్రికాపై ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుందని ఇంజమామ్ తెలిపాడు. అదే విధంగా అతడు భారత బౌలర్లపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు.

"ఈ మ్యాచ్‌లో హర్షల్‌ పటేల్‌,చాహల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. టీమిండియా విజయం సాధించడంతో ఈ సిరీస్‌ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకుముందు ప్రోటీస్ సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని భావించాను. కాని భారత బౌలర్లు దక్షిణాఫ్రికా విజయాన్ని అడ్డుకున్నారు.

ఇక టీమిం‍డియా స్వదేశంలో అంత సులభంగా ఓడిపోదు. కాబట్టి ఇప్పుడు దక్షిణాఫ్రికాపై ఒత్తిడి ఉంది. టీమిండియా యువ ఆటగాళ్లు పోరాట పటిమను కనబరుస్తున్నారు. జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి సీనియర్‌ ఆటగాళ్లు లేరు. అయినప్పటికీ వారు అద్భుతమైన విజయాన్ని సాధించగలిగారు" అని ఇంజమామ్-ఉల్-హక్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20.. టీమిండియా యువ పేసర్‌ దూరం..!

మరిన్ని వార్తలు