‘రవిశాస్త్రి, టీమిండియా ఆటగాళ్లు.. ఒక్కరంటే ఒక్కరు కూడా..!’

15 Sep, 2021 19:54 IST|Sakshi

ముంబై: ఇంగ్లండ్ తో జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ అర్ధంతరంగా  రద్దయిన నేపథ్యంలో.. మ్యాచ్‌ రద్దుకు దారి తీసిన కారణాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు శిక్షణ సిబ్బంది కూడా కరోనా బారిన పడటంతో ఈ మ్యాచ్ రద్దయిన తెలిసిందే. నాలుగో టెస్టు ముందు బయో బబుల్ నిబంధనలు బేఖాతరు చేస్తూ రవిశాస్త్రి తన 'స్టార్ గేజర్' పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి  కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు ఇతర ఆటగాళ్లు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం జరిగిన కొద్ది రోజులకే నాలుగో టెస్ట్ ముందు రవిశాస్త్రి వైరస్ బారిన పడ్డాడు. దీంతో మ్యాచ్‌ రద్దుకు రవిశాస్త్రి కారణమంటూ విమర్శలు కూడా వచ్చాయి.

కాగా, ఈ పుస్తకావిష్కరణకు హాజరు కావడానికి భారత జట్టు అనుమతి తీసుకోలేదని బీసీసీఐ కూడా పేర్కొంది. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన భారత మాజీ ఆటగాడు దిలీప్ దోషి కొన్ని ముఖ్యమైన వివరాలను తాజాగా  వెల్లడించాడు.  కోచ్ రవిశాస్త్రితో కలిసి బుక్ లాంచ్ ఈవెంట్‌కి హాజరైన భారత క్రికెటర్లు కనీసం మాస్క్ కూడా ధరించలేదని అతడు తెలిపాడు.

"నేను పుస్తకావిష్కరణకు హాజరయ్యాను. నన్ను తాజ్ గ్రూప్ ఆహ్వానించింది. చాలా మంది ప్రముఖులు,  టీమిండియా ఆటగాళ్లు కొద్దిసేపు అక్కడ ఉన్నారు.. వారెవరూ మాస్కు ధరించకపోవడం చూసి నేను ఆశ్చర్యపోయాను" అని  దిలీప్ దోషి తెలిపాడు. మస్కు ధరించడం తప్పనిసరి చేయాలని.. భారత జట్టు జాగ్రత్తలు తీసుకోవాలని తాను ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

చదవండి: ICC Mens T20I Rankings: టాప్‌- 10లో భారత్‌​ నుంచి వాళ్లిద్దరే!

మరిన్ని వార్తలు