NZ Vs BAN: ఏకకాలంలో నలుగురు పరిగెత్తుకొచ్చారు.. ఏం లాభం!

13 Oct, 2022 08:08 IST|Sakshi

న్యూజిలాండ్‌ ప్రస్తుతం పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌తో ట్రై సిరీస్‌ ఆడడంలో బిజీగా ఉంది. టి20 ప్రపంచకప్‌కు మంచి ప్రాక్టీస్‌లా ఉపయోగపడుతున్న ఈ ట్రై సిరీస్‌లో ఇప్పటికే బంగ్లాదేశ్‌ నిష్క్రమించింది. శుక్రవారం జరగనున్న ఫైనల్లో న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌లు అమితుమీ తేల్చుకోనున్నాయి. కాగా బంగ్లాదేశ్‌, కివీస్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ సమయంలో తొలి ఓవర్‌లో నజ్‌ముల్‌ షాంటో ఇచ్చిన సులువైన క్యాచ్‌ను న్యూజిలాండ్‌ ఆటగాళ్లు వదిలేశారు. ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన గుడ్‌లెంగ్త్‌ బంతిని షాంటో గాల్లోకి లేపాడు. అంతే క్యాచ్‌ తీసుకోవడానికి ఏకకాలంలో నలుగురు ఫీల్డర్లు పరిగెత్తుకొచ్చారు. చూసినవాళ్లు కచ్చితంగా ఆ నలుగురిలో ఎవరో ఒకరు క్యాచ్‌ తీసుకుంటారని అనుకున్నారు. తీరా చూస్తే ఒక్కడు కూడా పట్టుకోలేదు. దీంతో బౌల్ట్‌.. ఏంటిది అన్నట్లుగా అసహనం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే న్యూజిలాండ్‌ 48 పరుగులతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల  నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసింది. డెవన్‌ కాన్వే(40 బంతుల్లో 64 పరుగులు), గ్లెన్‌ పిలిప్స్‌(24 బంతుల్లో 60 పరుగులు) మెరుపులు మెరిపించారు. గుప్టిల్‌ 34, ఫిన్‌ అలెన్‌ 32 పరుగులతో రాణించారు.  

209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులు చేసి ఓడిపోయింది. షకీబ్‌ అల్‌ హసన్‌ (44 బంతుల్లో 70; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించాడు. బంగ్లాదేశ్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడంతో ఈ టోర్నీలోని మూడో జట్టు పాకిస్తాన్‌ కూడా ఫైనల్‌ చేరింది. నేడు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ మధ్య చివరి లీగ్‌ మ్యాచ్‌ ఉంది. 

చదవండి: తిలక్‌ వర్మ.. ఈసారి మాత్రం వదల్లేదు

రక్తం కళ్ల చూసిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు