విలియమ్సన్, సౌతీలకు ఊరట.. ఐపీఎల్‌ కోసం..!

15 Mar, 2023 07:40 IST|Sakshi

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు (ఎన్‌జడ్‌సీ) తమ ప్రధాన క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడేందుకు మార్గం సుగమం చేసింది. శ్రీలంకతో రెండో టెస్టు తదుపరి వన్డే సిరీస్‌ నుంచి లీగ్‌ కాంట్రాక్టు దక్కించుకున్న తమ కీలక ఆటగాళ్లను విడుదల చేయనుంది. కేన్‌ విలియమ్సన్‌ (గుజరాత్‌ టైటాన్స్‌), టిమ్‌ సౌతీ (కోల్‌కతా నైట్‌రైడర్స్‌), డెవాన్‌ కాన్వే, సాన్‌ట్నర్‌ (చెన్నై సూపర్‌ కింగ్స్‌)లు ఆయా ఫ్రాంచైజీలతో జట్టు కట్టేందుకు రిలీజ్‌ చేయాలని ఎన్‌జడ్‌సీ నిర్ణయించింది. లంకతో ఆఖరి టెస్టు ఆడిన వెంటనే వీళ్లంతా భారత్‌కు బయల్దేరతారు.

మరో ముగ్గురు క్రికెటర్లు ఫిన్‌ అలెన్‌ (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు), ఫెర్గూసన్‌ (కోల్‌కతా), గ్లెన్‌ ఫిలిప్స్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లు)లకు 25న ఆక్లాండ్‌లో జరిగే తొలి వన్డే అనంతరం లీగ్‌లో అడేందుకు అనుమతించింది. ఈ సీజన్‌ ఐపీఎల్‌ పోటీలు మార్చి 31 నుంచి జరుగనున్నాయి. ఈ లీగ్‌కు ముందు న్యూజిలాండ్‌–శ్రీలంక జట్ల మధ్య 17 నుంచి 21 వరకు చివరిదైన రెండో టెస్ట్‌ జరుగుతుంది. ఇది ముగియగానే ఈనెల 25, 28, 31 తేదీల్లో మూడు వన్డేల సిరీస్‌... ఏప్రిల్‌ 2, 5, 8 తేదీల్లో మూడు టి20ల సిరీస్‌ జరగనుంది.   

మరిన్ని వార్తలు