గంగూలీ, కోహ్లికి మధురై బెంచ్‌ చురకలు!

21 Nov, 2020 14:56 IST|Sakshi

చెన్నై: ఆన్‌లైన్‌ గేమ్‌లను నిషేదిస్తూ తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌లో నగదు లావాదేవీలతో బెట్టింగులను ప్రోత్సహించే గేమ్స్‌ నిర్వహించేవారికి జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఆన్‌లైన్ రమ్మీ, క్రికెట్‌ తదితర గేమ్‌లు ఆడుతూ దొరికిని వారికి రూ.5 వేల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధించనున్నారు. ఆన్‌లైన్ గేమ్‌ సెంటర్లను నిర్వహిస్తూ పట్టుబడితే రూ.10 వేల జరిమానాతో పాటు రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు.

కరోనా కట్టడికి గత మార్చి నెలలో లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఆన్‌లైన్‌ గేమ్స్‌కి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. తమిళనాడులో ఆన్‌లైన్‌లో పేకాట ఆడుతూ డబ్బులు కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నవారి ఘటనలు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. ఈ అంశంపై అక్కడి హైకోర్టుకు చెందిన మదురై బెంచ్‌లో పిల్ దాఖలైంది. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఆన్‌లైన్ ఆటలపై నిషేధం విధించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివరణ కోరుతూ పలు ప్రశ్నలను సంధించింది. ఈ నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

స్టార్‌డమ్‌ను ఇందుకేనా వాడేది
ఇర ఆన్‌లైన్‌ గేమ్స్‌పై నిషేధం విధించాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన మదురై బెంచ్‌ తాజా, మాజీ టీమిండియా ఆటగాళ్లపైనా విమర్శలు చేసింది. లక్షలాది మంది అభిమానులు ఉన్న ఆటగాళ్లు ఆన్‌లైన్‌ గేమ్స్‌ని ప్రోత్సహిస్తూ అడ్వర్టయిజ్‌మెంట్లలో పాల్గొనడమేంటని ప్రశ్నించింది. వారిపై అభిమానంతో అమాయక జనం ‘ప్రమాదకర’ ఆన్‌లైన్‌ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించింది. మరికొంత మంది అప్పులపాలై ప్రాణాలు తీసుకుంటున్నారని తెలిపింది. ప్రజల్ని ఇబ్బందులకు గురిచేసే యాడ్స్‌లో పాల్గొనేటప్పుడు ఆలోచించుకోవాలని చురకలు వేసింది. ఆన్‌లైన్ గేమ్స్‌ ప్రమోట్‌ చేయడంపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. కాగా, డ్రీమ్‌ 11, ఎంపీఎల్‌ ఆన్‌లైన్ గేమ్స్‌కి గంగూలీ,‌‌ కోహ్లి ప్రమోటర్లుగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆన్‌లైన్‌ గేమ్స్‌ కట్టడికి ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి.

మరిన్ని వార్తలు