IPL 2022: 'ధావన్‌తో ఓపెనింగ్‌ చేసే అవకాశం రావడం నా అదృష్టం'

2 Mar, 2022 08:54 IST|Sakshi

ఐపీఎల్‌-2022 సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా మయాంక్‌ అగర్వాల్‌ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ క్యాచ్‌ రిచ్‌ లీగ్‌ ఆరంభానికి ముందు అగర్వాల్‌ తన మనసులోని మాటను బయట పెట్టాడు. ఈ సీజన్‌లో శిఖర్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్‌ చేయడానికి ఉత్సాహంగా ఉన్నానని మయాంక్‌ తెలిపాడు. ఐపీఎల్‌-2022 మెగా వేలానికి ముందు అగర్వాల్‌ను పంజాబ్‌ రీటైన్‌ చేసుకోగా.. ధావన్‌ను వేలంలో రూ. 8.2 కోట్లకు కొనుగోలు చేసింది. "పంజాబ్ జట్టులో చాలా  మంది స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా శిఖర్‌ ధావన్‌ లాంటి అద్భుతమైన ఆటగాడితో  ఓపెనింగ్ చేసే అవకాశం రావడం నా ఆదృష్టం. ఇక ఈ సీజన్‌లో అండర్‌-19 ప్రపంచకప్‌ హీరో రాజ్‌ బావాను సొంతం చేసుకున్నాము.

అతడికి ఇది తొలి సీజన్‌ కావడంతో చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అదే విధంగా అతడితో ఆడటానికి నేను ఎదురు చూస్తున్నాను. ఈ ఇద్దరే కాదు.. అందరి ఆటగాళ్లతో ఆడటానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మయాంక్‌ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్‌ మెగా వేలానికి ముందు మయాంక్‌ను రూ.12 కోట్లకు పంజాబ్‌ రీటైన్‌ చేసుకుంది. ఐపీఎల్‌లో 100 మ్యాచ్‌లు ఆడిన అగర్వాల్‌ 2135 పరుగులు సాధించాడు. ఇక గతేడాది సీజన్‌లో కూడా మయాంక్‌ అద్భుతంగా రాణించాడు. గత సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన అతడు 441 పరుగులు చేశాడు. ఐపీఎల్‌-2022 మార్చి 26న ప్రారంభం కానుంది.

చదవండి: Icc women's world cup 2022: వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం.. అదరగొట్టిన మంధాన

మరిన్ని వార్తలు