ధోని వీడ్కోలు మ్యాచ్‌ అక్కడే జరగాలి: సీఎం

17 Aug, 2020 10:48 IST|Sakshi

ధోనీకి వీడ్కోలు ప‌లికేందుకు చివ‌రి ఫేర్‌వెల్ మ్యాచ్!

న్యూఢిల్లీ : టీమీండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. 16 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు ప‌లుకుతూ త‌ప్పుకుంటున్న‌ట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ప్ర‌క‌టించాడు. అయితే గ‌తేడాది న్యూడిలాండ్‌తో చివ‌రి మ్యాచ్ ఆడిన ధోని ఆ త‌ర్వాత  జ‌ట్టుకు దూరంగా ఉంటూ ఏ స్థాయి క్రికెట్‌లో కూడా పాల్గొనలేదు. దీంతో ధోనికి గొప్ప‌గా వీడ్కోలు పలికేందుకు అతని స్వ‌స్థ‌లం రాంచీలో ఓ ఫేర్‌వెల్ మ్యాచ్‌ నిర్వహించాలంటూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బీసీసీఐని కోరారు. జార్ఖండ్ ఆతిథ్యం ఇవ్వ‌బోయే ఈ చివ‌రి మ్యాచ్ కోసం ప్ర‌పంచం అంతా ఎదురు చూస్తుంద‌ని ధోనికి ఫేర్‌వెల్ మ్యాచ్‌ రాంచీలో నిర్వ‌హించాలని కోరుతూ ఆయన లేఖ రాశారు. ‘ఇక 7వ నెంబర్‌ జెర్సీలో హెలికాప్ట‌ర్ షాట్లు క్రికెట్ స్టేడియంలో క‌నిపించ‌వు. దేశానికి, జార్ఖండ్‌కు ఎన్నో గ‌ర్వించ‌ద‌గ్గ విజ‌యాల‌ను ఇచ్చిన ధోనికి గొప్ప‌గా విడ్కోలు ప‌లుకుదాం అంటూ’ సీఎం హేమంత్ సోరెన్ బీసీసీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. (3 కోట్ల వ్యూస్‌కు చేరువలో ధోని వీడ్కోలు పాట)

గతేడాది కాలంగా ధోని రిటైర్మెంట్‌పై ఎన్నో ఊహాగానాలు వ‌చ్చాయి. వ‌న్డే ప్రపంచ‌క‌ప్‌లో సెమీ ఫైన‌ల్ మ్యాచ్ త‌ర్వాత ధోనీ మ‌ళ్లీ క్ల‌బ్ స్థాయి క్రికెట్ కూడా ఆడ‌లేదు. కోట్లాది అభిమానుల్ని నిరాశకు గురిచేస్తూ టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని రిటైర్‌మెంట్‌ నిర్ణయం తీసుకున్నాడు. దాదాపు 16 ఏళ్ళ పాటు టీం ఇండియాకు సేవలు అందించిన ధోనీ.. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించి మరపురాని విజయాలు అందించాడు. 2007లో టి20 ప్రపంచ కప్, ఆ తర్వాత భారత అభిమానులంతా కలలు గన్న వన్డే వరల్డ్‌ కప్‌ (2011)తో పాటు 2013లో చాంపియన్‌ ట్రోఫీని కూడా సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. మూడు ఐసీసీ టోర్నీలను గెలిచిన ఏకైక కెప్టెన్‌గా నిలిచిపోయాడు. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్‌ 10వరకు ఐపీఎల్ 2020 జరుగనున్న సంగతి తెలిసిందే. (‘నీతోపాటు ఉన్నందుకు ఎంతో ఆనందించా ధోని’ )

మరిన్ని వార్తలు