Wahab Riaz: ఆర్థిక సంక్షోభం.. పాక్‌ క్రికెటర్‌కు మంత్రి పదవి

28 Jan, 2023 12:00 IST|Sakshi

పాకిస్తాన్‌ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. రోజువారి నిత్యావసర ధరలు ఆకాశన్నంటగా.. అంతర్జాతీయంగా పాక్‌ రూపాయి ధర మరింత దిగజారింది. దీనికి తోడు విద్యుత్‌ కొరతతో దేశం తీవ్రంగా సతమతమవుతుంది. అయితే ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడం కోసం పాక్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం పలు మంత్రిత్వ శాఖల్లో మార్పులు చేపట్టింది. ఈ నేపథ్యంలో పాక్‌ సీనియర్‌ క్రికెటర్‌ వహాబ్‌ రియాజ్‌ను క్రీడాశాఖ మంత్రిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

పాకిస్థాన్ ప్రభుత్వం పంజాబ్ ప్రావిన్స్‌లోని తాత్కాలిక క్యాబినెట్‌లో పాక్ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్‌ను క్రీడా మంత్రిగా నియమించింది. విశేషమేమిటంటే ప్రస్తుతం వహాబ్ రియాజ్ అందుబాటులో లేడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో బిజీగా గడుపుతున్నాడు.  దీంతో ఉన్నపళంగా పాక్‌కు తిరిగి రావాలని ప్రభుత్వం ఆదేశించింది. బంగ్లాదేశ్‌ నుంచి తిరిగి వచ్చిన తర్వాత  వహాబ్‌ రియాజ్‌ మంత్రిగా  ప్రమాణం చేయనున్నాడు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను కొందరు రాజకీయ నిపుణులు తప్పుబట్టారు.

ఇక లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ వహాబ్ రియాజ్ పాకిస్థాన్ తరఫున  2008లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఫాస్ట్‌ బౌలర్‌గా మంచి గుర్తింపు పొందిన వహాబ్‌ రియాజ్‌.. 91 వన్డేల్లో 120 వికెట్లు, 27 టెస్టుల్లో 83 వికెట్లు,36 టి20ల్లో 38 వికెట్లు పడగొట్టాడు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన పాకిస్థాన్ జట్టులో వహాబ్ సభ్యుడుగా ఉన్నాడు. అయితే 2020 తర్వాత వహాబ్‌ రియాజ్‌ పాకిస్థాన్ జట్టులో చోటు కోల్పోయాడు. అప్పటినుంచి టి20 లీగ్స్‌లో బిజీ అయిన వహబ్ రియాజ్ మొత్తంగా 400 వికెట్లకు పైగా సాధించాడు. ప్రస్తుతం బీపీఎల్‌లో ఖుల్నా టైగర్స్ తరఫున ఆడుతున్న అతను 9 వికెట్లు పడగొట్టాడు. 

చదవండి: 'కోహ్లి స్థానాన్ని అప్పగించాం.. ఇలాగేనా ఔటయ్యేది'

మాట మార్చిన పాక్‌ క్రికెటర్‌.. అయినా కోహ్లితో నాకు పోలికేంటి?!

మరిన్ని వార్తలు