Pak Vs Eng 5th T20: పాకిస్తాన్‌కు భారీ షాక్‌! ఆస్పత్రిపాలైన కీలక పేసర్‌

28 Sep, 2022 13:03 IST|Sakshi
ఇంగ్లండ్‌తో పాక్‌ టీ20 సిరీస్‌(PC: PCB)

Pakistan vs England, 5th T20I: ఇంగ్లండ్‌తో ఐదో టీ20 మ్యాచ్‌ ఆరంభానికి ముందు పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ బౌలర్‌ నసీం షా అనారోగ్య కారణాల వల్ల జట్టుకు దూరమయ్యాడు. తీవ్రమైన జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్‌ వచ్చిన నేపథ్యంలో నసీం షా ఆస్పత్రి పాలయ్యాడు. లాహోర్‌లోని ఓ ఆస్పత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అధికార ప్రతినిధి జియో టీవీతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

టీమిండియాతో మ్యాచ్‌తో అరంగేట్రం
ప్రస్తుతం నసీం కోలుకుంటున్నాడని.. అయితే మిగతా రెండు మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉంటాడో లేదో రిపోర్టులు వచ్చిన తర్వాతే తెలుస్తుందన్నారు. కాగా ఆసియా కప్‌-2022లో టీమిండియాతో మ్యాచ్‌లో అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేసిన 19 ఏళ్ల నసీం షా.. ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టోర్నీలో మొత్తంగా ఈ పేసర్‌ ఏడు వికెట్లు పడగొట్టాడు. అయితే, స్వదేశంలో ఇంగ్లండ్‌తో తొలి టీ20లో మాత్రం తేలిపోయాడు.


నసీం షా(PC: PCB)

స్వదేశంలో మొదటి టీ20లో మాత్రం
నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసిన నసీం షా 41 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఈ క్రమంలో మిగతా మూడు మ్యాచ్‌లలో తుది జట్టులో అతడికి స్థానం దక్కలేదు. ఇక కీలకమైన ఐదో టీ20 ఆడతాడనుకుంటే అనారోగ్యం పాలయ్యాడు.

కాగా టీ20 ప్రపంచకప్‌-2022 జట్టులో నసీం షా చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌ ఆరంభానికి ముందు పాక్‌.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరుగగా ఇరు జట్టు రెండేసి విజయాలతో 2-2తో సమంగా ఉన్నాయి. 

చదవండి: Ind Vs SA 1st T20: అతడు లేని జట్టు బలహీనం.. టీమిండియా ఓడిపోతుంది: భారత మాజీ క్రికెటర్‌
LLC 2022: దంచికొట్టిన కింగ్స్‌ బ్యాటర్లు.. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడ్డ సెహ్వాగ్‌ సేన

మరిన్ని వార్తలు