PAK VS NZ 3rd ODI: రెచ్చిపోయిన గ్లెన్‌ ఫిలిప్స్‌.. చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌

14 Jan, 2023 09:47 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ గడ్డపై మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్‌ జట్టు తొలిసారి సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్‌తో శుక్రవారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో న్యూజిలాండ్‌ రెండు వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్‌ 2–1తో దక్కించుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 280 పరుగులు చేసింది. ఫఖర్‌ జమాన్‌ (101; 10 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ సాధించాడు. మొహమ్మద్‌ రిజ్వాన్‌ (77; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు.

కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌతీ (3/56) ఆకట్టుకున్నాడు. అనంతరం న్యూజిలాండ్‌ 48.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసి విజయం సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ డెవాన్‌ కాన్వే (52; 5 ఫోర్లు, 1 సిక్స్‌), విలియమ్సన్‌ (53; 2 ఫోర్లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గ్లెన్‌ ఫిలిప్స్‌ (42 బంతుల్లో 63 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించి న్యూజిలాండ్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. పాక్‌తో సిరీస్‌ ముగించుకున్న న్యూజిలాండ్‌ ఈనెల 18 నుంచి భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది.   

మరిన్ని వార్తలు