పాకిస్తాన్‌దే వన్డే సిరీస్‌

8 Apr, 2021 06:26 IST|Sakshi

సెంచూరియన్‌: ఫఖర్‌ జమాన్‌ (104 బంతుల్లో 101; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ.. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (82 బంతుల్లో 94; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ (57; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించడంతో... దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో పాకిస్తాన్‌ 28 పరుగుల తేడాతో గెలిచింది. సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. 2013 తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై పాక్‌ వన్డే సిరీస్‌ నెగ్గడం గమనార్హం.

మొదట బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 320 పరుగులు సాధించింది.  చివర్లో హసన్‌ అలీ (11 బంతుల్లో 32 నాటౌట్‌; ఫోర్, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అనంతరం దక్షిణాఫ్రికా 49.3 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. వెరీన్‌ (62; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫెలుక్వాయో (54; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. షాహీన్‌ అఫ్రిది, నవాజ్‌లకు మూడేసి వికెట్లు లభించాయి.

మరిన్ని వార్తలు