#MSDhoni: దాయాది అభిమానులే మెచ్చుకునేలా!

31 May, 2023 08:15 IST|Sakshi
Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో సీఎస్‌కే విజేతగా నిలవడంపై దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఈ సీజన్‌ మొత్తం ధోని నామస్మరణతోనే మార్మోగిపోయింది. సీఎస్‌కే ఎక్కడ మ్యాచ్‌ ఆడినా అభిమానులు తండోపతండాలుగా వచ్చేవారు. దీనికి ప్రధాన కారణం సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని. ధోని భజన మరీ ఎక్కువైపోయిందన్నా పర్లేదు.. కానీ ఒక విషయం మాత్రం తప్పక తెలుసుకోవాల్సిందే.

సీఎస్‌కే విజేతగా నిలవడంపై మన దేశ అభిమానులే కాదు.. దాయాది దేశం పాకిస్తాన్‌ అభిమానులు కూడా తెగ సంతోషపడిపోయారు. సీఎస్‌కే ఐదోసారి ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత పాకిస్తాన్‌లో కొన్నిచోట్ల క్రికెట్‌ ఫ్యాన్స్‌ సెలబ్రేట్‌ చేసుకోవడం కనిపించింది. ధోని కటౌట్స్‌తో వీధుల్లో తిరుగుతూ భారీ ఎత్తున కేక్‌ కటింగ్స్‌ నిర్వహించారు. ఈ చర్యతో వైరం అనేది దేశాల మధ్యే కానీ ఆటపై కాదని తెలియజేశారు.

ఇక పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్లు రమీజ్‌ రజా, సక్లెయిన్‌ ముస్తాక్‌, షోయబ్‌ అక్తర్‌, సయీద్‌ అన్వర్‌ సహా మరికొంతమంది సీఎస్‌కే టీమ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇక ధోని టైటిల్‌ గెలిచిన అనంతరం మాట్లాడుతూ కాస్త ఎమోషన్‌కు గురయ్యాడు. రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం అనిపించినప్పటికి వచ్చే సీజన్‌ ఆడాలా వద్దా అనే దానిపై మరో ఏడు, ఎనిమిది నెలల్లో తుది నిర్ణయం తీసుకుంటా. అప్పటికి శరీరం సహకరించి ఫిట్‌గా ఉంటే అభిమానుల కోసం మరో ఐపీఎల్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నా అంటూ పేర్కొన్నాడు.

చదవండి: ఒక్క ఆటోగ్రాఫ్‌ కోసం బతిమాలించుకున్నాడు!

మరిన్ని వార్తలు