భారత్‌పై చెత్త రికార్డుకు కారణం మా జట్టు అత్యుత్సాహమే: పాక్‌ క్రికెటర్‌

9 Aug, 2022 18:06 IST|Sakshi

ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో ఇప్పటి వరకు దాయాది దేశం పాకిస్తాన్‌పై భారత్‌ పైయి సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వన్డే,టీ20 ప్రపంచకప్‌లలో ఇరు జట్లు ముఖాముఖి 13 సార్లు తలపడగా..  టీమిండియా 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. పాకిస్తాన్‌ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలుపొందింది. అది కూడా టీ20 ప్రపంచకప్‌-2021లో దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై పాక్‌ విజయం సాధించింది. దీంతో ఎట్టకేలకు వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో భారత్‌పై పాక్‌ గెలుపు రుచి చూడగలిగింది.

ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ సమరానికి కౌంట్‌ డౌన్‌ మొదలైంది. మరోసారి టీమిండియా తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఆక్టోబర్‌ 23న మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికగా భారత్‌-పాక్‌ పోరు షూరూ కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి గతేడాది ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్‌ సేన భావిస్తోంది. ఈ మ్యాచ్‌ కోసం ఇరు దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్‌-పాక్‌ జట్లు ఆసియా కప్‌లో తలపడనున్నాయి. దుబాయ్‌ వేదికగా ఆగస్టు 28న పాక్‌ను టీమిండియా ఢీ కొట్టనుంది. ఇక ఇది ఇలా ఉండగా..  పాక్‌ జట్టుపై ఆ దేశ ఆటగాడు సోహైబ్ మక్సూద్ సంచలన వాఖ్యలు చేశాడు. ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో భారత్‌పై పాక్‌ చెత్త రికార్డుకు తమ జట్టు అత్యుత్సాహమే కారణమని మక్సూద్ అభిప్రాయపడ్డాడు.. 

"వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల్లో భారత్‌పై పాక్‌ అత్యంత చెత్త రికార్డును కలిగి ఉంది. దానికి కారణం మా జట్టు ఆటగాళ్లు భారత్‌తో మ్యాచ్‌ అంటే అత్యుత్సాహ పడతారు. అయితే ఇటీవల కాలంలో మా జట్టు వైఖరి మారింది. టీమిండియాతో మ్యాచ్‌ను ఒక సాధారణ మ్యాచ్‌లా చూడటం ప్రారంభించాం. తద్వారా భారత్‌పై మేము మెరుగైన ప్రదర్శన చేయగలుగుతున్నాం" అని జియో న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మక్సూద్ పేర్కొన్నాడు.
చదవండి: Rudi Koertzen: క్రికెట్‌లో విషాదం.. దిగ్గజ అంపైర్‌ కన్నుమూత

మరిన్ని వార్తలు