Asia Cup 2022: మనసులో మాటను బయటపెట్టిన పాక్‌ ఆల్‌రౌండర్‌

26 Aug, 2022 21:18 IST|Sakshi
Shadab Khan(Photo Source: Twitter)

పాకిస్తాన్‌ లెగ్‌స్పిన్నర్‌.. వైస్‌ కెప్టెన్‌ షాదాబ్‌ ఖాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిరకాల ప్రత్యర్థులైన భారత్‌, పాకిస్తాన్‌లు ఆగస్టు 28న దుబాయ్‌లోని షేక్‌ జాయెద్‌ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో షాదాబ్‌ ఖాన్‌ తన మనుసులోని మాటను బయటపెట్టాడు.

''వ్యక్తిగతంగా ఆసియాకప్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలవాలనేది నా లక్ష్యం. అది అంత ఈజీ కాదు. ఎందుకంటే మాతో​పాటు భారత్‌, శ్రీలంక, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జట్లు కూడా ఉన్నాయి. ఈ జట్ల నుంచి వరల్డ్‌ మేటి క్రికెటర్లు ఉన్నారు. వాళ్లందరిని దాటుకొని లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. నా వంతు ప్రయత్నం చేయడానికి నేను ఎప్పుడు సిద్ధమే.

ఆ నమ్మకమే నాకు సక్సెస్‌తో పాటు అవార్డును కూడా తీసుకొస్తుంది. ఒకవేళ ఆసియాకప్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ ట్రోపీ ఎత్తుకుంటే మాత్రం నా గోల్‌ పూర్తయినట్లే. కానీ అల్టిమేట్‌ లక్ష్యం మాత్రం పాకిస్తాన్‌కు ఆసియా కప్‌ అందించడమే. ఇది నా ప్రథమ కర్తవ్యం. దీని తర్వాతే మిగతావన్నీ'' అని పీసీబీకి ఇచ్చిన ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. 

23 ఏళ్ల షాదాబ్‌ ఖాన్‌ తన లెగ్‌ స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టడంతో అవసరమైన దశలో బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించడంలో దిట్ట. షాదాబ్‌ ఖాన్‌ మంచి ఫీల్డర్‌ కూడా. గూగ్లీ వేయడంలో దిట్ట అయిన షాదాబ్‌ ఖాన్‌ పాక్‌ తరపున 64 టి20ల్లో 73 వికెట్లు.. 275 పరుగులు, 52 వన్డేల్లో 69 వికెట్లు, 596 పరుగులు, 6 టెస్టుల్లో 14 వికెట్లు, 300 పరుగులు సాధించాడు.

చదవండి: పాక్‌కు మరో ఎదురుదెబ్బ.. వెన్నునొప్పితో కీలక బౌలర్‌ దూరం!

కోహ్లి, రోహిత్‌ అయిపోయారు.. ఇప్పుడు పంత్‌, జడేజా వంతు

మరిన్ని వార్తలు