మ్యాచ్‌ ఆడుతుండగానే చాతిలో నొప్పి... పరుగున ఆసుపత్రికి

21 Dec, 2021 15:26 IST|Sakshi

పాకిస్తాన్‌ టెస్టు ఓపెనర్‌ అబీద్‌ అలీ చాతినొప్పికి గురయ్యాడు. క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో భాగంగా కైబర్‌ పంక్తున్నవాతో జరుగుతున్న మ్యాచ్‌లో అబీద్‌ అలీ 61 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్‌ ద్వారా అబీద్‌ అలీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 9వేల పరుగులు పూర్తి చేశాడు. కాగా మ్యాచ్‌ ఆడుతున్న సమయంలోనే అతనికి రెండుసార్లు చాతినొప్పి రావడంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.

డ్రెస్సింగ్‌రూమ్‌కు చేరుకున్న అబీద్‌ వెంటనే ఫిజియో సలహాతో ఆసుపత్రిలో జాయినయ్యాడు. ప్రస్తుతం అబీద్‌ అలీ అబ్జర్వేషన్‌లో ఉన్నాడని.. గుండె సంబంధిత వ్యాధి ఏమైనా ఉందా అన్న కోణంలో వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికైతే అతని పరిస్థితి బాగానే ఉందని.. చెకప్‌ తర్వాత అబీద్‌ అలీ పరిస్థితిపై ఒక క్లారిటీ వస్తుందని సెంట్రల్‌ పంజాబ్‌ మేనేజర్‌ అశ్రఫ్‌ అలీ పేర్కొన్నాడు. ఇక క్వాయిడ్‌-ఎ-అజం ట్రోఫీ ద్వారా 2007లో క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అబీద్‌ అలీ 31 ఏళ్ల వయసులో పాకిస్తాన్‌ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇక పాక్‌ జాతీయ జట్టు తరపున 16 టెస్టులు ఆడిన అబీద్‌ అలీ 16 టెస్టుల్లో 1180 పరుగులు చేశాడు. 

చదవండి: Shoaib Maliks Nephew: రికార్డు సృష్టించిన షోయబ్‌ మాలిక్‌ మేనల్లుడు.. అరుదైన ఘనత

>
మరిన్ని వార్తలు