SL Vs Pak: పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌ రద్దు చేసుకున్న శ్రీలంక.. కారణం ఇదే!

9 May, 2022 16:27 IST|Sakshi

Pakistan Tour Of Sri Lanka 2022: పాకిస్తాన్‌ జట్ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్‌ రద్దయింది. ఆతిథ్య శ్రీలంక విజ్ఞప్తి మేరకు తాము ఇందుకు అంగీకరించినట్లు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) వెల్లడించింది. కాగా రెండు టెస్టు మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కై పాకిస్తాన్‌ జూలై- ఆగష్టు నెలలో శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది.

అయితే, దేశంలో ప్రస్తుత పరిస్థితులు, శ్రీలంక ప్రీమియర్‌ లీగ్‌ షెడ్యూల్‌ మార్పు నేపథ్యంలో వన్డే సిరీస్‌ను రద్దు చేసుకోవాలని శ్రీలంక భావించింది. ఐసీసీ వరల్డ్‌ కప్‌ సూపర్‌ లీగ్‌ షెడ్యూల్‌లో భాగం కానుందన ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పీసీబీ దృష్టికి తీసుకువెళ్లగా ఇందుకు సానుకూల స్పందన వచ్చింది. అయితే, ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ మాత్రం యథావిథిగా కొనసాగనుంది.

ఈ విషయాల గురించి పీసీబీ మీడియా డైరెక్టర్‌ సమీ ఉల్‌ హసన్‌ బర్నే క్రికెట్‌ పాకిస్తాన్‌తో మాట్లాడుతూ.. ‘‘ఆర్థికంగా నిలదొక్కుకునే క్రమంలో లంకన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను వారం ముందే ఆరంభించాలనుకుంటున్నట్లు శ్రీలంకన్‌ బోర్డు చెప్పింది. కాబట్టి వన్డే సిరీస్‌ను రద్దు చేయాలని కోరింది. ఇది వరల్డ్‌కప్‌ సూపర్‌లీగ్‌లో భాగం కాదు కాబట్టి మేము ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. టెస్టు సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ త్వరలోనే విడుదల కానుంది’’ అని పేర్కొన్నారు.

కాగా శ్రీలంక ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రధాని మహీంద్ర రాజపక్స రాజీనామాతో అక్కడ రాజకీయ సంక్షోభం కూడా నెలకొంది.

చదవండి👉🏾Virat Kohli: కోహ్లి గోల్డెన్‌ డక్‌.. మరేం పర్లేదు.. కోచ్‌ అంటే ఇలా ఉండాలి! వైరల్‌
చదవండి👉🏾ICC POTM- April: ‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’ విజేత ఎవరంటే!

మరిన్ని వార్తలు