CWG 2022: జావెలిన్‌ త్రోలో నదీమ్‌ ‘గోల్డెన్‌ త్రో’ 

9 Aug, 2022 07:23 IST|Sakshi

కామన్వెల్త్‌ గేమ్స్‌ జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో పాకిస్తాన్‌ అథ్లెట్‌ నదీమ్‌ అద్భుతం చేశాడు. ఫైనల్లో నదీమ్‌ జావెలిన్‌ను 90.18 మీటర్ల దూరం విసిరి స్వర్ణం సాధించాడు. ఈ క్రమంలో జావెలిన్‌ను 90 మీటర్లకు పైగా విసిరిన రెండో ఆసియా అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. 2017లో చైనీస్‌ తైపీ అథ్లెట్‌ 91.36 మీటర్ల దూరం విసిరాడు. నదీమ్‌ ప్రదర్శనతో పాక్‌ 56 ఏళ్ల తర్వాత కామన్వెల్త్‌ గేమ్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో పతకం గెలిచింది.  

ఇదిలా ఉంటే భారత స్టార్‌, వరల్డ్‌ నంబర్‌ వన్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా గాయం కారణంగా చివరి నిమిషంలో కామన్‌వెల్త్‌ క్రీడల బరిలో నుంచి తప్పుకోవడం నదీమ్‌కు కలిసొచ్చింది. నీరజ్‌ గైర్హాజరీలో నదీమ్‌ చెలరేగాడు. కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి పాక్‌ కల సాకారం చేశాడు. ఇటీవల ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో నదీం నాలుగో స్థానంలో నిలువగా‌.. నీరజ్‌ చోప్రా ఈటెను 88.13 మీటర్ల దూరం విసిరి రజత పతకాన్ని (రెండో స్థానం) గెల్చుకున్నాడు.

నీరజ్‌ అదే ఊపులో కామన్‌వెల్త్‌ బరిలోకి దిగి ఉంటే అలవోకగా 90 మీటర్ల దూరం విసిరేవాడు. ఏదిఏమైనప్పటికీ నీరజ్‌ కామన్‌వెల్త్‌ క్రీడల బరిలో లేకపోవడంతో పాక్‌ 56 ఏళ్ల కల నెరవేరింది. కాగా, నీరజ్‌ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో చరిత్రలో భారత్‌కు రజత పతకం అందించిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 2003లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ బాబీజార్జి కాంస్య పతకాన్ని సాధించింది. 
చదవండి: భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సం‍దడి మొదలైంది.. హీటెక్కిస్తున్న హిట్‌మ్యాన్‌ ప్రోమో

మరిన్ని వార్తలు