హార్దిక్‌ వీర బాదుడు

27 Nov, 2020 16:06 IST|Sakshi

సిడ్నీ:  ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా చెలరేగిపోయాడు. ఆసీస్‌ నిర్దేశించిన 375 పరుగుల ఛేదనలో భాగంగా 101 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో హార్దిక్‌ పాండ్యా తన సహజ సిద్ధమైన శైలిలో దూకుడుగా ఆడాడు. టీ20 ఫార్మాట్‌ తరహాలో రెచ్చిపోయి 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బౌలర్‌ ఎవరనే విషయాన్ని పక్కన పెట్టిన హార్దిక్‌ బ్యాట్‌ను ఝుళిపించాడు. హార్దిక్‌ పాండ్యా దూకుడుగా ఆడి జట్టు స్కోరును గాడిలో పెట్టాడు. మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌ సిక్స్‌ కొట్టి హాఫ్‌ సెంచరీ సాధించాడు పాండ్యా,. భారీ స్కోరు కావడంతో బంతుల్ని వృథా చేయకుండా రన్‌రేట్‌ను కాపాడుతూ బ్యాట్‌కు పని చెప్పాడు. హార్దిక్‌ పాండ్యా దెబ్బకు టీమిండియా 26 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. (చదవండి: జంపా.. ఆర్సీబీ గుర్తొచ్చిందా?)

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ జట్టులో ఫించ్‌(114;124 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టీవ్‌ స్మిత్‌(105; 66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు),  డేవిడ్‌ వార్నర్‌(69; 76 బంతుల్లో 6 ఫోర్లు)లు రాణించడంతో ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో భాగంగా భారత్‌ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. టీమిండియా ఇన్నింగ్స్‌ను మయాంక్‌ అగర్వాల్‌-శిఖర్‌ ధావన్‌లు ధాటిగా ప్రారంభించారు. ఓవర్‌కు 10 పరుగుల రన్‌రేట్‌ను మెయింటైన్‌ చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 5 ఓవర్లలో 53 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని అందించారు. అయితే హజిల్‌వుడ్‌ వేసిన ఆరో ఓవర్‌ రెండో బంతికి మయాంక్‌ ఔటయ్యాడు. ఆఫ్‌ సైడ్‌ ఆడబోయిన బంతిని మ్యాక్స్‌వెల్‌ క్యాచ్‌గా పట్టుకోవడంతో మయాంక్‌ తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. కోహ్లి(21) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, వెంటనే అయ్యర్‌(2) కూడా ఔటయ్యాడు. కేఎల్‌ రాహుల్‌(12) నిరాశపరిచాడు. ధావన్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు.  పాండ్యా-ధావన్‌ల జోడి నిలకడగా ఆడటంతో టీమిండియా తిరిగి గాడిలో పడింది.

మరిన్ని వార్తలు