పంత్‌ మొత్తుకున్నా నమ్మలేదు..

15 Jan, 2021 13:28 IST|Sakshi

ఎవరికీ నమ్మకం లేని రిషభ్‌

బ్రిస్బేన్‌: ప్రత్యర్థి ఆటగాళ్లు ఔట్‌ విషయంలో ఎంఎస్‌ ధోని చెబితే అది దాదాపు కచ్చితంగా ఉండేది. డీఆర్‌ఎస్‌ విషయంలో కానీ, స్టంపింగ్‌లో కానీ క్యాచ్‌ ఔట్‌ విషయంలో కానీ ధోనిది ప్రత్యేక శైలి. మరి ధోని వారసుడిగా వచ్చిన యువ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ మాత్రం కచ్చితత్వంలో విఫలమవుతున్నాడా అంటే అవుననక తప్పదు. భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాల్గో టెస్టులో భాగంగా ఒక ఔట్‌ విషయంలో పంత్‌ ఎంత మొత్తుకున్నా మన టీమిండియా క్రికెటర్లు దాన్ని పట్టించుకోలేదు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా  నటరాజన్‌ వేసిన 84 ఓవర్‌ మూడో బంతిని లెంగ్త్‌ బాల్‌ వేశాడు. ఆ బంతి కాస్త స్వింగ్‌ అవుతూ వికెట్‌ కీపర్‌ పంత్‌ చేతుల్లో పడింది. అయితే అవుట్‌ సైడ్‌ స్వింగ్‌ అవుతూ వెళ్లిన బంతి పంత్‌ చేతుల్లో పడిన వెంటనే ఔట్‌ కోసం అప్పీల్‌ చేశాడు. ఆ బంతిని ఆడదామని భావించిన పైన్‌.. దానిని చివరి నిమిషంలో విడిచిపెట్టాడు.  అది బ్యాట్స్‌మన్‌ పైన్‌ బ్యాట్‌కు తగిలినట్లు భావించిన పంత్‌.. అప్పీల్‌ కు వెళ్లాడు. దానికి అంపైర్‌ నుంచి మొదలుకొని టీమిండియా క్రికెటర్లూ ఎవరూ స్పందించలేదు. కనీసం డీఆర్‌ఎస్‌ కోరదామని కెప్టెన్‌ రహానేను కోరినా దానికి నవ్వి వదిలేశాడు. ఇక స్లిప్‌ల్లో ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌, పుజారాలకు కూడా నవ్వి ఊరుకున్నారు. దీనికి పంత్‌ చాలా నిరాశ చెందాడు. తాను ఔట్‌ అని మొత్తుకున్నా సహచర క్రికెటర్ల నుంచి సరైన సహకారం లభించకపోవడంతో పంత్‌ అసంతృప్తికి లోనయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ తన ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేయగా అది వైరల్‌గా మారింది.  (రైనా నుంచి కోహ్లి వరకు.. సేమ్‌ టు సేమ్‌)

ఈ మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కాడు లబూషేన్‌. 37 పరుగుల వద్ద దొరికిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకుని శతకం పూర్తి చేసుకున్నాడు. ఇది లబూషేన్‌కు టెస్టుల్లో ఐదో సెంచరీ. బ్రిస్బేన్‌ టెస్టులో భాగంగా లబూషేన్‌ క్యాచ్‌ను రహానే వదిలేశాడు. నవదీప్‌ సైనీ వేసిన 36 ఓవర్‌ ఐదో బంతికి గల్లీలోకి స్టైయిట్‌ ఫార్వర్డ్‌ క్యాచ్‌ ఇచ్చాడు లబూషేన్‌. దాన్ని రహానే జారవిడిచాడు. పట్టాల్సిన క్యాచ్‌ను వదిలేయడంతో రహానే నిరాశ చెందాడు.  స్టీవ్‌ స్మిత్‌ ఔటైన తర్వాత ఓవర్‌లో లబూషేన్‌ క్యాచ్‌ ఇచ్చినా అది నేలపాలైంది. కానీ ఆ తర్వాత  మళ్లీ లబూషేన్‌ చాన్స్‌ ఇచ్చాడు. లబూషేన్‌ ఇచ్చిన మరొక క్యాచ్‌ ఫస్ట్‌ స్టిప్‌లో పుజారా ముందు పడిపోవడంతో మళ్లీ బ్రతికిపోయాడు. ఆ తర్వాత హాఫ్‌ సెంచరీని శతకంగా మలచుకున్నాడు లబూషేన్‌. శతకంతో  ఆసీస్‌ తేరుకోగా, టీమిండియా మూల్యం చెల్లించుకున్నట్లయ్యింది. 195 బంతుల్లో 9 ఫోర్లతో సెంచరీ సాధించాడు లబూషేన్‌.  

మాథ్యూవేడ్‌(45;87 బంతుల్లో 6 ఫోర్లు)తో కలిసి 113 పరుగులు జత చేశాడు లబూషేన్‌. కాగా, ఆసీస్‌ స్కోరు రెండొందల వద్ద ఉండగా వేడ్‌ నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. కాగా, సెంచరీ సాధించిన తర్వాత లబూషేన్‌ ఎంత సేపో క్రీజ్‌లో నిలవలేదు. నటరాజన్‌ వేసిన 66 ఓవర్‌ ఐదో బంతికి పంత్‌కు క్యాచ్‌ లబూషేన్‌ ఔటయ్యాడు.దాంతో 213 పరుగుల వద్ద ఆసీస్‌ ఐదో వికెట్‌ను కోల్పోయింది. 204 బంతుల్లో 108 పరుగులు చేసి లబూషేన్‌ ఔటయ్యాడు. ఆపై కామెరూన్‌ గ్రీన్‌-పైన్‌లు వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ ఐదు వికెట్ల నష్టానికి  274 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో నటరాజన్‌ రెండు వికెట్లు సాధించగా,  సిరాజ్‌, శార్దూల్‌, సుందర్‌లకు తలో వికెట్‌ లభించింది. (లెఫ్టార్మ్‌ సీమర్‌ను చూసి ఎంత కాలమైందో తెలుసా?)

మరిన్ని వార్తలు