IND vs AUS: టీమిండియాతో మూడో టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్‌! కెప్టెన్‌గా స్మిత్‌

24 Feb, 2023 13:08 IST|Sakshi

టీమిండియాతో మూడో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఉన్నపళంగా స్వదేశానికి వెళ్లిన కమ్మిన్స్‌.. ఇప్పుడు మూడో టెస్టుకు ముందు తిరిగి భారత్‌కు  తిరిగి రావడం లేదని వెల్లడించాడు. దీంతో అతడి స్థానంలో మూడో టెస్టుకు స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ సారథ్యం వహించనున్నాడు.

కాగా తన తల్లి అనారోగ్యం బారిన పడటంతో రెండో టెస్ట్ ముగిసిన తర్వాత హుటాహుటిన కమిన్స్ స్వదేశానికి వెళ్లాడు. అయితే ఇండోర్‌ వేదికగా జరగున్న మూడో టెస్టుకు దాదాపు 10 రోజుల సమయం ఉండడంతో కమ్మిన్స్‌ తిరిగి వస్తాడని క్రికెట్‌ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో వెల్లడించింది. కానీ తన తల్లి ఆరోగ్యం ఇంకా కుదటపడకపోవడంతో అక్కడే కొన్ని రోజులు ఉండాలని కమ్మిన్స్‌ నిర్ణయించుకున్నాడు.

ఈ నేపథ్యంలో కమ్మిన్స్‌ మాట్లాడుతూ.. "ఈ సమయంలో భారత్‌కు తిరిగి రాకూడదని నిర్ణయించుకున్నాను. నేను నా కుటుంబంతో ఇక్కడ ఉండటం చాలా ముఖ్యం. నాకు మద్దతుగా నిలిచిన క్రికెట్‌ ఆస్ట్రేలియాకు, నా సహాచర ఆటగాళ్లకు ధన్యవాదాలు అని పేర్కొన్నాడు. అయితే అహ్మదాబాద్‌ వేదికగా జరిగే నాలుగో టెస్టుకు కమిన్స్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

కాగా తొలి రెండు టెస్టుల్లో టీమిండియా చేతిలో ఘోర ఓటమి చవిచూసిన ఆస్ట్రేలియా.. మార్చి1 నుంచి ఇండోర్‌ వేదికగా జరగనున్న మూడో టెస్టుకు సన్నద్దం అవుతోంది. ఇక ఇప్పటికే ఆసీస్‌ జట్టుకు డేవిడ్‌ వార్నర్‌, హాజిల్‌వుడ్‌, ఆగర్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు దూరమయ్యారు.
చదవండి: T20 WC: 'నేను ఏడుస్తుంటే నా దేశం చూడకూడదు.. అందుకే అలా చేశా'

మరిన్ని వార్తలు