ఓటమితో ముగించిన సన్‌రైజర్స్‌.. చివరి పోరులో పంజాబ్‌ గెలుపు

23 May, 2022 07:15 IST|Sakshi

ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్న సన్‌రైజర్స్‌

ముంబై: ఎనిమిది జట్లు పాల్గొన్న గత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఎనిమిదో స్థానం... పది జట్లు పాల్గొన్న ఈసారి ఐపీఎల్‌లోనూ అదే స్థానం...అంతే తేడా, మిగతా అంతా సేమ్‌ టు సేమ్‌! మరోసారి అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తూ హైదరాబాద్‌ ఐపీఎల్‌ సీజన్‌ను పేలవంగా ముగించింది. టోర్నీపరంగా ప్రాధాన్యత కోల్పో యిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆదివారం పంజాబ్‌ కింగ్స్‌ 5 వికెట్లతో హైదరాబాద్‌ను ఓడించింది. ముందుగా సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.

అభిషేక్‌ శర్మ (32 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా... రొమారియో షెఫర్డ్‌ (15 బంతుల్లో 26 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), వాషింగ్టన్‌ సుందర్‌ (19 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్‌), మార్క్‌రమ్‌ (21), రాహుల్‌ త్రిపాఠి (20) తలా ఓ చేయి వేశారు. పంజాబ్‌ బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హర్‌ప్రీత్‌ బ్రార్, ఎలిస్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం పంజాబ్‌ 15.1 ఓవర్లలో 160 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్‌ (22 బంతుల్లో 49 నాటౌట్‌; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరిపించగా, శిఖర్‌ ధావన్‌ (32 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఫజల్‌ హఖ్‌ ఫారూఖీకి 2 వికెట్లు దక్కాయి. 

మరిన్ని వార్తలు