మూడో రౌండ్‌లో హరికృష్ణ

17 Jul, 2021 04:01 IST|Sakshi

సోచి (రష్యా): ప్రపంచకప్‌ చెస్‌ నాకౌట్‌ టోర్నమెంట్‌లో ఓపెన్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణతోపాటు భారత్‌కే చెందిన ఆధిబన్, ప్రజ్ఞానంద, నిహాల్‌ సరీన్‌ మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో హరికృష్ణ 1.5–0.5తో యాసిర్‌ పెరెజ్‌ క్యూసాడా (క్యూబా)పై, ఆధిబన్‌ 2–0తో న్యూరిస్‌ డెల్గాడో రమిరెజ్‌ (పరాగ్వే)పై, ప్రజ్ఞానంద 2–0తో గాబ్రియెల్‌ సర్గాసియన్‌ (అర్మేనియా)పై, నిహాల్‌ 1.5–0.5తో సనన్‌ జుగిరోవ్‌ (రష్యా)పై గెలిచారు. నిర్ణీత రెండు గేమ్‌లు ముగిశాక విదిత్‌ (భారత్‌)–అలెగ్జాండర్‌ ఫియెర్‌ (బ్రెజిల్‌); గుకేశ్‌ (భారత్‌)–దుబోవ్‌ (రష్యా) 1–1తో సమంగా నిలిచారు.

దాంతో విజేతను నిర్ణయించేందుకు శనివారం ‘టైబ్రేక్‌’ నిర్వహిస్తారు. అరవింద్‌ చిదంబరం (భారత్‌) 0.5–1.5తో నోదిర్బెక్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో... ఇనియన్‌ (భారత్‌) 0–2తో తొమాస్‌షెవ్‌స్కీ (రష్యా) చేతిలో ఓడిపోయారు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. హారిక ప్రత్యర్థి మెదీనా (ఇండోనేసియా)కు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆమె బరిలోకి దిగలేదు. భక్తి కులకర్ణి 0.5–1.5తో నటాలియా పొగోనినా (రష్యా) చేతిలో... వైశాలి 0–2తో బేలా ఖొటెనాష్‌విలి (జార్జియా) చేతిలో ఓడిపోయారు. పద్మిని రౌత్‌ (భారత్‌)–సారాసదత్‌ (ఇరాన్‌) 1–1తో సమంగా నిలువడంతో శనివారం టైబ్రేక్‌లో తలపడతారు.  

మరిన్ని వార్తలు