కోహ్లిని ప్రశంసలతో ముంచెత్తిన చెన్నై సూపర్‌ కింగ్స్‌

10 Sep, 2022 15:09 IST|Sakshi

CSK Tweets On Virat Kohli: ఫోర్‌ టైమ్‌ ఐపీఎల్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్ టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై తమ మనసులో మాటను బయటపెట్టింది. కోహ్లి ప్రత్యర్ధి టీమ్‌ ఆటగాడైనా అతనిపై అభిమానాన్ని చాటుకుంది. కోహ్లి 1020 రోజుల తర్వాత సెంచరీ చేసిన నేపథ్యంలో ఆసక్తికర ట్వీట్లు చేసింది. ఈ వరుస ట్వీట్లు ప్రస్తుతం సోషల్‌మీడియలో వైరలవుతున్నాయి. 

ఇంతకీ సీఎస్‌కే కోహ్లిను ఉద్దేశించి ఏం చెప్పిందంటే.. ఆసియా కప్‌-2022లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి అద్భుతమైన సెంచరీతో (61 బంతుల్లో 122 నాటౌట్‌) చెలరేగాడు. ఈ సెంచరీ (71వ శతకం) కోసం కోహ్లి సుదీర్ఘకాలం వేచి చూడాల్సి రావడంతో అతని కెరీర్‌లో ఇది ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు కోహ్లికి అభినందనలు తెలుపుతున్నారు.

ఈ క్రమంలో ఐపీఎల్‌ జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సైతం కోహ్లిని అభినందనలతో ముంచెత్తింది. కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌ అని అందరూ అంటున్నారు.. ఇంతకీ కోహ్లి ఎప్పుడు పడ్డాడని తిరిగి లేవడానికి, అతనో నిరంతర పోరాట యోధుడు, సవాళ్లు ఎదురైన ప్రతిసారి నిర్భయంగా ఎదుర్కొన్నాడు, ఒక్కసారి కూడా వెనుదిరిగింది లేదు, రన్‌మెషీన్‌ పరుగులు సాధించాడు, సాధిస్తున్నాడు, సాధిస్తూనే ఉంటాడంటూ వరుస ట్వీట్లతో కోహ్లిని ఆ​కాశానికెత్తింది.

సీఎస్‌కే తమ ప్రత్యర్థి ఆటగాడైన కోహ్లి పట్ల ఇంత సానుకూల ట్వీట్లు చేయడంతో అభిమానుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుంది. కోహ్లిని పొగిడిన నోటితోనే జనం సీఎస్‌కేను సైతం అభినంధిస్తున్నారు. ప్రత్యర్ధి ఆటగాడైనప్పటికీ సీఎస్‌కే క్రీడా స్పూర్తి చాటుకుందని మెచ్చుకుంటున్నారు.

కాగా, దుబాయ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. కోహ్లి సూపర్‌ సెంచరీతో చెలరేగడంతో 212 పరుగులు చేయగా.. ఛేదనలో ఆఫ్ఘన్‌ 111 పరుగులకే పరిమితమై దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఆసియా కప్‌ ఫైనల్స్‌కు శ్రీలంక, పాక్‌ జట్లు చేరాయి. ఆదివారం జరిగే తుదిపోరులో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. 
చదవండి: Asia Cup 2022: కోహ్లి, రోహిత్‌ కాదు.. టీమిండియా వైఫల్యానికి ప్రధాన కారణం ఇదే!

మరిన్ని వార్తలు