ఈ ఏడాది ఐపీఎల్‌లో వీరి మెరుపులు లేనట్టేనా..?

18 Mar, 2021 17:34 IST|Sakshi

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్‌లో పలువురు విదేశీ ఆటగాళ్ల మెరుపులను అభిమానులు మిస్‌ కానున్నారా..? అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే వారు తమ దేశం తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండడమే ఇందుకు కారణం. ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరంకానున్న ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే.. అందులో అందరూ దక్షిణఫ్రికా క్రికెటర్లే ఉన్నారు. స్వదేశంలో పాకిస్థాన్‌తో 3 వన్డేలు, 4 టీ20లు ఆడాల్సి ఉండటంతో ఆ స్టార్లందరూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఐపీఎల్‌కు దూరంకానున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్వింటన్ డికాక్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లు రబాడ, అన్రిచ్ నోర్జ్, చెన్నై సూపర్‌ కింగ్స్ సభ్యులు లుంగి ఎంగిడి, ఫాఫ్ డుప్లెసిస్‌లు ఉన్నారు. 

వీరిలో ముఖ్యంగా క్వింటన్‌ డికాక్, రబాడ, ఫాఫ్ డుప్లెసిస్‌లు తమతమ ఫ్రాంఛైజీల గెలుపోటములను ప్రభావితం చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు. డికాక్‌ ‌ గత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు తరుపుముక్కగా నిలిచాడు. అతను ఆడిని 16 మ్యాచ్‌ల్లో 140.5 స్ట్రెక్‌రేట్‌తో 503 పరుగులు చేసి, ముంబై టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఫాఫ్ డుప్లెసిస్‌ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన ఆటగాళ్లలో ఒకడైన ఆయన గత సీజన్‌‌లో 13 మ్యాచ్‌ల్లో‌ 40.81 సగటుతో 449 పరుగులు సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రబాడ..‌ గత రెండు సీజన్లలో 29 మ్యాచ్‌లాడి 55 వికెట్లు తీశాడు. గత సీజన్లో 17 మ్యాచ్‌లాడిన ఆయన 8.34 ఎకానమీతో ఏకంగా 30 వికెట్లు పడగొట్టాడు. ఫాస్ట్‌ బౌలర్లు అన్రిచ్ నోర్జ్, లుంగి ఎంగిడిలు సైతం వారివారి ఫ్రాంఛైజీల జయాపజయాలను ప్రభావితం చేయగల ఆటగాళ్లే. 
 

మరిన్ని వార్తలు