కిడాంబి శ్రీకాంత్‌కు ప్రధాని అభినందన

21 Dec, 2021 12:14 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ లో రజతం నెగ్గిన స్టార్‌ షట్లర్, ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘శ్రీకాంత్‌కు అభినందనలు. రజతంతో చరిత్రకెక్కావు. నీ విజయం మరెంతో మంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. 


కాగా, వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను నెగ్గే సువర్ణావకాశాన్ని తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌ తృటిలో చేజార్చుకున్న విషయం తెలిసిందే. హోరాహోరీ సాగిన ఫైనల్లో ప్రపంచ 22వ సీడ్‌ ఆటగాడు, సింగపూర్‌కు చెందిన లో కియోన్ యో చేతిలో 15-21, 20-22 తేడాతో వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు. 42 నిమిషాల పాటు రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో 15వ సీడ్‌ శ్రీకాంత్‌ అద్భుతంగా పోరాడినప్పటికీ.. కీలక సమయాల్లో ప్రత్యర్ధి పైచేయి సాధించాడు. ఫలితంగా, శ్రీకాంత్‌ రజతంతో సరిపెట్టుకోగా, కియోన్‌ కెరీర్‌లో తొలి టైటిల్‌ నెగ్గి.. ఈ ఘనత సాధించిన తొలి సింగపూర్‌ షట్లర్‌గా చరిత్ర సృష్టించాడు.

ఇదిలా ఉంటే, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌ నుంచి పీవీ సింధు మాత్రమే స్వర్ణం గెలిచింది. ఈ టోర్నీలో వరుసగా రెండు సార్లు రజతాలు గెలిచిన సింధు.. 2019లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు