Lionel Messi: ప్రధాని మోదీకి మెస్సీ జెర్సీ ​కానుకగా..

7 Feb, 2023 15:23 IST|Sakshi

భారత ప్రధాని నరేంద్ర మోదీకి అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ జెర్సీ గిఫ్ట్‌గా రావడం ఆసక్తి కలిగించింది. అర్జెంటీనాకు చెందిన వైపీఎఫ్‌ అనే పెట్రోలియన్‌ అండ్‌ గ్యాస్‌ కార్పోరేషన్‌ సంస్థ బెంగళూరులో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వారోత్సవాలకు హాజరయ్యింది. సంస్థ అధ్యక్షుడు పాబ్లో గొంజాలెజ్‌ ప్రధాని మోదీకి మంగళవారం మెస్సీ జెర్సీని అందజేశారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి ఫోటోలకు ఫోజిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా ఫైనల్లో ఫ్రాన్స్‌ను షూటౌట్‌లో 4-2తో మట్టికరిపించి జగజ్జేతగా అవతరించింది. మారడోనా తర్వాత దిగ్గజ ఆటగాడిగా పేరు పొందిన మెస్సీ ఫిపా వరల్డ్‌కప్‌ను అందుకోవాలన్న తన కలను సాకారం చేసుకోవడంతో పాటు అర్జెంటీనా 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్‌ అభిమానులు మెస్సీ ఘనతను పొగడ్తలతో ముంచెత్తారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా మెస్సీని ప్రశంసించిన జాబితాలో ఉన్నారు. 

మరిన్ని వార్తలు