Rishabh Pant: తప్పుడు వార్తలు.. తాగి నడిపితే 200 కిమీ దూరం ఎలా వస్తాడు!

31 Dec, 2022 20:12 IST|Sakshi

టీమిండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్‌ పంత్ తాగి నడపడంతోనే కారు ప్రమాదానికి గురయ్యిందంటూ కొంతమంది సోషల్‌ మీడియాలో పేర్కొనడం సంచలనం రేపింది. అయితే ఈ వార్తలను పోలీసులు ఖండించారు. పంత్‌ తాగి కారు నడిపి ఉంటే అంత దూరం ఎలా వస్తాడని.. ఇవన్నీ తప్పుడు వార్తలని.. ఎవరు నమ్మొద్దని.. యాక్సిడెంట్‌ జరిగిన సమయంలో పంత్‌ సాధారణ స్థితిలోనే ఉన్నట్లు వైద్యులు నిర్థారించారని పోలీసులు పేర్కొన్నారు.

''మేము 8-10 స్పీడ్ కెమెరాల‌ను ప‌రిశీలించాం. ఒక‌వేళ పంత్ మ‌ద్యం సేవించి ఉంటే ఢిల్లీ నుంచి 200 కిలోమీట‌ర్ల దూరం ఒక్క యాక్సిడెంట్ కూడా చేయ‌కుండా కారు ఎలా న‌డ‌ప‌గ‌ల‌డు? కారు ప్ర‌మాదానికి గురైన‌ప్పుడు పంత్ సాధార‌ణ స్థితిలోనే ఉన్న‌ట్లు ప్రాథ‌మిక చికిత్స చేసిన వైద్యుడు వెల్ల‌డించాడు. పంత్ మ‌ద్యం సేవించ‌లేదు కాబ‌ట్టి కారు లోంచి బ‌య‌ట‌కు రాగ‌లిగాడు. ఆ టైమ్‌లో తాగిన‌వాళ్లు కారు నుంచి బ‌య‌ట‌కు రాలేరు. పైగా పంత్‌ను రక్షించిన బస్‌ డ్రైవర్‌తో కూడా పంత్‌ మాములుగానే మాట్లాడడం సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయింది.

పంత్‌ తన కారును ఎక్కడా 80 కిలోమీట‌ర్ల వేగ ప‌రిమితికి మించి నడపలేదు. బహుశా నిద్రమత్తు రావడంతో కారు డివైడ‌ర్‌ను ఢీకొట్టి ఉంటుంది.  అయితే 70 నుంచి 80 కిమీ వేగంతో ఉండడంతోనే కారు గాల్లో ప‌ల్టీ కొట్టింది. మా టెక్నిక‌ల్ టీమ్ యాక్సిడెంట్ జ‌రిగిన స్థలానికి వెళ్లింది. అక్క‌డ ఓవ‌ర్ స్పీడ్‌కు సంబంధించిన ఆధారాలు ఏవీ ల‌భించ‌లేదు. నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడడం తప్పు'' అని హ‌రిద్వార్ సీనియ‌ర్ ఎస్పీ అజ‌య్ సింగ్ తెలిపారు.

ప్ర‌స్తుతం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్ప‌త్రిలో పంత్ చికిత్స పొందుతున్నాడు. అత‌నికి ఈరోజు ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేశారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పంత్‌ కోలుకునేందుకు కనీసం ఆరు నెలలు పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో పంత్‌ వచ్చే ఏడాది క్రికెట్‌ ఆడడం అనుమానమే. 

చదవండి: WWE: అంతుచిక్కని వ్యాధితో మాజీ రెజ్లింగ్‌ స్టార్‌ కన్నుమూత

తల్లిని సర్‌ప్రైజ్‌ చేద్దామనుకుని ఇలా!.. త్వరగా కోలుకో.. కోహ్లి ట్వీట్‌

మరిన్ని వార్తలు