-

బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌.. భారత తుది జట్టు ఇదే..!

13 Dec, 2022 21:56 IST|Sakshi

IND VS BAN 1st Test: 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా చట్టోగ్రామ్‌ వేదికగా భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య రేపటి (డిసెంబర్‌ 14) నుంచి తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. భారతకాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయే ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. వన్డే సిరీస్‌ గెలిచిన ఉత్సాహంలో ఆతిధ్య బంగ్లాదేశ్‌ ఉరకలేస్తుండగా.. టెస్ట్‌ సిరీస్‌ గెలిచి పరువు కాపాడుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. 

ఈ నేపథ్యంలో తొలి టెస్ట్‌కు భారత తుది జట్టు ఎలా ఉండబోతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. జట్టులో మార్పులు చేర్పులతో గజిబిజి గందరగోళంగా ఉన్న టీమిండియా పరిస్థితి మ్యాచ్‌ సమయానికి ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తుది జట్టులో తప్పక ఉంటాడనుకున్న ఉనద్కత్‌ ఇండియాలోనే ఇరుక్కుపోవడం, వికెట్‌కీపర్‌గా ఎవరిని ఎంపిక చేయాలన్న సందిగ్ధత టీమిండియా యాజమాన్యాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి.

ఈ మ్యాచ్‌లో సరైన జట్టు ఎంపిక జరగక టీమిండియా ఓడితే, అది వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌పై ప్రభావం చూపుతుందని మేనేజ్‌మెంట్‌ ఆందోళన చెందుతుంది. జట్టులో ఏడు స్థానాలు ఖరారు కాగా.. మిగిలిన 4 స్థానాలపై సందిగ్ధత నెలకొంది.

వికెట్‌కీపర్‌ స్థానం కోసం పంత్‌, శ్రీకర్‌ భరత్‌ మధ్య పోటీ ఉండగా, ఆల్‌రౌండర్ల బెర్త్‌కు అక్షర్‌ పటేల్‌, సౌరభ్‌ కుమార్‌, శార్దూల్‌ ఠాకూర్‌ పోటీ పడుతున్నారు. స్పిన్నర్లుగా అశ్విన్‌, కుల్దీప్‌ స్థానానికి ఎలాంటి ఢోకా లేనప్పటికీ.. పేసర్ల విభాగంలో ఉమేశ్‌, సిరాజ్‌, సైనీ మధ్య పోటీ ఉంది.

భారత తుది జట్టు (అంచనా): ఓపెనర్లుగా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, వన్‌ డౌన్‌లో పుజారా, నాలుగో స్థానంలో కోహ్లి, ఐదో ప్లేస్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ పేర్లు ఖరారు కాగా,  పంత్‌/ శ్రీకర్‌ భరత్‌, అక్షర్‌ పటేల్‌/సౌరభ్‌ కుమార్‌/ శార్ధూల్‌ ఠాకూర్‌, అశ్విన్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఉమేశ్‌ యాదవ్‌, సిరాజ్‌/ సైనీ   

భారత్‌: శుభ్‌మన్‌ గిల్‌, అభిమన్యు ఈశ్వరన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, చతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, సౌరభ్‌ కుమార్‌, కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), శ్రీకర్‌ భరత్‌ (వికెట్‌కీపర్‌), రిషబ్‌ పంత్‌, కుల్దీప్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, నవ్‌దీప్‌ సైనీ  
 

మరిన్ని వార్తలు