వరుస సెంచరీలతో చెలరేగుతున్న పృథ్వీ షా

11 Mar, 2021 14:28 IST|Sakshi

ఢిల్లీ: విజ‌య్ హ‌జారే ట్రోఫీలో ముంబై కెప్టెన్ పృథ్వీ షా ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగుతున్నాడు. ఇప్పటికే టోర్నీలో మూడు సెంచరీలు బాదిన పృథ్వీ తాజాగా మరో సెంచరీ బాదేశాడు. ఈ నాలుగు సెంచరీల్లో మూడుసార్లు 150కి పైగా స్కోరు నమోదు చేయడం విశేషం. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో 227 నాటౌట్‌, 185 ప‌రుగులు నాటౌట్‌తో చెలరేగాడు. తాజాగా క‌ర్ణాట‌క‌తో జ‌రుగుతున్న సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో కేవ‌లం 122 బంతుల్లో 167 ప‌రుగులు చేశాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 7 సిక్స‌ర్లు ఉన్నాయి.

అయితే కర్ణాటకతో జరగుతున్న మ్యాచ్‌లో ఆరంభంలో ఇన్నింగ్స్‌ నెమ్మ‌దిగా ప్రారంభించిన పృథ్వీ షా త‌ర్వాత వేగం పెంచాడు. 79 బంతుల్లోనే టోర్నీలో మూడో సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో  దారుణ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో జట్టులో చోటు పోగొట్టున్న షా.. విజయ్‌ హజారే ట్రోపీలో మాత్రం చెలరేగి ఆడుతున్నాడు.  ఈ క్ర‌మంలో అత‌డు విజ‌య్ హజారే ట్రోఫీ ఒక సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్ప‌టికే టోర్నీలో 725 ప‌రుగులు చేసిన పృథ్వీ.. 723 ప‌రుగుల‌తో మ‌యాంక్ అగ‌ర్వాల్ పేరిట ఉన్న రికార్డును తాజాగా బ‌ద్ధ‌లుకొట్టాడు. కాగా తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై 49.2 ఓవర్లలో 322 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన కర్ణాటక 3 ఓవర్లలో 1 వికెట్‌ నష్టానికి 18 పరుగులు చేసింది.


 

మరిన్ని వార్తలు